తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని అందుకు సంబంధించిన కార్యాచరణను కమలదళం సిద్ధం చేసింది. ఉత్తర భారత దేశంలో పట్టు సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణ భారతదేశంపై దృష్టి సారించింది. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్నారు. ఇందుకు తగ్గట్టు బీఆర్ఎస్ పై వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ అగ్రనేతల తెలంగాణ పర్యటనపై ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఈనెల 18న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), 28న కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) రాకతో రాష్ట్ర రాజకీయ వర్గాలు హీటెక్కాయి. ఇక బీజేపీ మిషన్ 90 షురూ చేసిందని చర్చ జరుగుతుంది.
18న ప్రధాని మోదీ రాక..
ఈనెల 18న ప్రధాని మోదీ రాక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ నుండి వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించడానికి ప్రధాని వస్తున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే వందే భారత్ ప్రారంభించడానికి రాబోతున్న ప్రధాని ఇక్కడ సభ కూడా నిర్వహించడం వెనక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల బీజేపీ మిషన్ 90ను ప్రధాని పర్యటనతోనే మొదలు పెట్టనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
28న అమిత్ షా రాక..
ప్రధాని మోదీ పర్యటన అనంతరం 10 రోజుల వ్యవధిలోనే అమిత్ షా రాకతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు బీజేపీ అగ్రనాయకుల రాక బీజేపీ మిషన్ 90కి కారణమని తెలుస్తుంది. మరికొన్ని నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఇటు ఇద్దరు నాయకుల తెలంగాణ రాక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.
బీజేపీ మిషన్ 90 షురూ చేసినట్టేనా?
తెలంగాణలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం వచ్చే ఏడాది పాటు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. ఆ 90స్థానాల్లో గెలుపు కోసం ఎలా ముందుకెళ్లాలి. ఆ 90 స్థానాల్లో బలమైన స్థానాలు ఎన్ని ఉన్నాయి. బలహీనమైన స్థానాలు ఎన్ని ఉన్నాయి. మొత్తం ఈ అంశాలకు సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. 90 స్థానాలకు గానూ 45 స్థానాల్లో బలహీనంగా ఉంది. ఈ స్థానాలలో బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే చేరికల కమిటీకి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ స్థానాలపై బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీలో ఉత్సాహం నింపడానికి ఇద్దరు నాయకులు రానున్నట్టు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.