MLA Rajasingh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీస్ కేసులు వీడడం లేదు. మొన్నటికి మొన్న ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయగా..తాజాగా హైదరాబాద్ లో మరో కేసు నమోదు అయింది. శ్రీరామనవమి సందర్బంగా ఏర్పాటు చేసిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కొడుకును పరిచయం చేస్తూ ఓ మతంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ రెచ్చగోట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు రాజాసింగ్ పై FIR నమోదు చేశారు. ఐపీసీ 153ఎ 1 (ఎ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయినా కానీ ఆయన తీరు మారకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ముంబైలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పిన విషయాన్ని ఈ నోటీసుల్లో గుర్తు చేశారు. కాగా గతంలో కూడా రాజాసింగ్ పై కేసులు నమోదు కాగా..కొన్నిరోజులు జైల్లో ఉండి ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక గతేడాది అజ్మీర్ దర్గాపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ (BJP MLA Raja singh) పై కేసు నమోదు అయింది. ఆ తరువాత ఈ కేసును కంచన్ భాగ్ నుండి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్ పోలీసులు జనవరి 20న 41A CRPC కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెయిల్ పై బయటకు రాజాసింగ్..
కాగా ఈ ఏడాది ఆగష్టు 25న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 29న పీడీ యాక్ట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ (Raja Singh) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ (Raja Singh) కమిటీకి విన్నవించుకున్నాడు. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు. కానీ దీనిపై విచారణ జరిపిన బోర్డు పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను సమర్ధించింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలన్న రాజాసింగ్ (Raja Singh) అభ్యర్ధనను కమిటీ తిరస్కరించింది. కానీ దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేయగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే 2004 నుంచి రాజాసింగ్పై 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 కేసులు కేవలం మతపరమైన విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవే కావడం గమనార్హం. ఇప్పటికే రాజాసింగ్ పై పీడి యాక్ట్ కూడా నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు నమోదు కావడం ఇదే మొదటిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Case file, Hyderabad, Raja Singh, Telangana