తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం(అక్టోబర్ 25న) ప్లీనరీ నిర్వహిస్తోన్న కారణంగా రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్లీనరీ ప్రధాన వేదిక హైటెక్స్(మాదాపూర్) చుట్టుపక్కల భారీ ఆంక్షలు ఉంటాయని, ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన రూట్ల వివరాలను, ఇతర సూచనలను వెల్లడించారు. ప్రధానంగా నీరూస్ జంక్షన్, సైబర్ టవర్ క్రాస్రోడ్స్, మెటల్ చార్మినార్, గూగుల్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్, ఖానామెట్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి బొటానికల్గార్డెన్ జంక్షన్ల వద్ద మళ్లింపులుంటాయని పోలీసులు చెబుతున్నారు.
- నీరూస్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, దుర్గంచెరువు, ఇనార్బిట్, ఐటీసీ కోహినూర్, ఐకియా, బయోడైవర్సిటీ వైపు మళ్లిస్తారు.
- మియాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట్ నుంచి హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్కు వెళ్లే వాహనదారులను రోలింగ్ హిల్స్, ఏఐజీ ఆస్పత్రి, ఐకియా, ఇనార్బిట్, దుర్గం చెరువు మీదుగా పంపుతారు.
- ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్సీయూ. ఐఐఐటీ, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad Traffic Police, Trs