ఆకతాయి కుర్రాడితో ప్రేమ కలాపాలు వద్దని మందలించిన తండ్రిపై కక్ష పెంచుకున్న మైనర్ బాలిక.. ఏకంగా సుపారీ ఇచ్చి మరీ కన్నతండ్రిని హత్య చేయించింది. హైదరాబాద్ లోని కుషాయిగూడలో జరిగిన ఈ సంచలన హత్య తాలూకు వివరాలను పోలీసులు తాజాగా మీడియాకు వెల్లడించారు. నిజానికి ఈ హత్య జులైలో జరగ్గా, తండ్రి కింద పడి మృతి చెందాడని ఆ బాలిక పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఆ వ్యక్తి హత్యకు గురయ్యాడని నిర్ధారణ కావడంతో మైనర్ బాలికను పోలీసులు మళ్లీ విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మైనర్ బాలికతోపాటు ఆమె ప్రియుడు, సుపారి గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్ చెప్పిన వివరాలివి..
హైదరాబాద్ కుషాయిగూడ ప్రాంతానికి చెందిన పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేవాడు. గత జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కానీ తాజాగా రామకృష్ణ పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.
రామకృష్ణ కిందపడి తలకు గాయమై చనిపోలేదని, అతని గొంతు నులిమి, బలంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతుడి భార్య, కుటుంబసభ్యులను మళ్లీ తమదైన శైలిలో విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి. రామకృష్ణ కుటుంబం గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్మెంట్లో నివసించేది. రామకృష్ణ కూతురైన మైనర్ బాలిక.. అపార్ట్మెంట్ వాచ్మన్ కొడుకు చెట్టి భూపాల్ (20)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించాడు.
మైనర్ బాలికను వలలో వేసుకున్న వాచ్ మెన్ కొడుకు భూపాల్.. ఆమెకు మాయమాటలు చెప్పి రామకృష్ణ ఇంట్లో ఉన్న రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు భూపాల్ను రిమాండ్ తరలించారు. అయితే.. రామకృష్ణ కూతురు ప్రేమ వ్యవహారం బయటపడితే పరువుపోతుందనే ఉద్దేశంతో అతను కాప్రాకు మకాం మార్చాడు. కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలైన భూపాల్.. తిరిగి బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతని మాయలో పూర్తిగా పడిపోయిన బాలిక.. అతణ్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని.. ప్రేమకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్యచేయాలని భావించింది. దీనికోసం..
మైనర్ బాలిక తన తండ్రిని చంపేందుకు ప్రియుడు భూపాల్ తో కలిసి స్కెచ్ వేసింది. భూపాల్ స్నేహితులకు సుపారీ ఇచ్చిమరీ పథకాన్ని అమలు చేసింది. సుపారీ గ్యాంగ్ జూలై 19న బాలికకు మత్తు పౌండర్ ఇచ్చారు. దాన్ని ఆహారంలో కలిపితే తండ్రి స్పృహకోల్పోతాడని చెప్పారు. ఆ మేరకు బాలిక.. ఇంట్లో వండిన కోడి కూరలో మత్తు మందు కలిపింది. అది తిన్న తల్లిదండ్రులు నిద్రలోకి వెళ్లిపోయారు. అర్ధరాత్రి తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించిన భూపాల్.. తన మిత్రులతో కలిసి రామకృష్ణను గొంతునులిమారు. భూపాల్, గణేష్ బ్లాంకెట్ వేసి రామకృష్ణ ముఖాన్ని అదిమిపట్టుకోగా, ప్రశాంత్ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో రామకృష్ణ మేల్కొగా.. అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ చికిత్స పొందుతూ మరణించాడు.
ఇంటి పెద్ద రామకృష్ణ చనిపోయినప్పటికీ, కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు అసలు విషయం చెప్పకుండా కిందపడి చనిపోయినట్లు ఫిర్యాదు చేశారు. తీరా పోస్ట్ మార్టం రిపోర్టులో అసలు నిజం బయటపడ్డ తర్వాత షాక్ తిన్న పోలీసులు.. మరోసారి విచారించడంతో మైనర్ బాలిక నేరాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం తండ్రి హత్యకు పాల్పడిన కూతురు, ఆమె ప్రియుడు భూపాల్, గణేష్, ప్రశాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారితోపాటు ప్రశాంత్ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతడి తండ్రి విజయ్పాల్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు మైనర్ కావడంతో పోలీసులు ఆమెను జువెనైల్ హోంకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Minor girl, Murder case