తెలంగాణ సహా యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధింస్తుండటంతో కౌంటింగ్ కేంద్రాల్లో నరాలు తెగిపోయే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితాలు చూస్తోన్న ప్రజలది సైతం అదే పరిస్థితి. దాదాపు అన్ని ఊర్లలో జనం టీవీలకు అతుక్కుపోయి హుజూరాబాద్ ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉద్యోగులు, పనుల్లో ఉన్నవాళ్లు న్యూస్ వెబ్ సైట్ల ద్వారా క్షణక్షణం అప్ డేట్స్ పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోన్న ప్రతి ఫోన్ సంభాషణలోనూ హుజూరాబాద్ ఫలితాన్ని గురించిన చర్చే సాగుతోంది. తొలి రెండు రౌండ్లలోనే గుండెలు జారిపోయే స్థాయిలో టెన్షన్ కనిపించగా, తదుపరి రౌండ్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలున్నాయి..
హుజూరాబాద్ లో ఎవరు గెలిచినా ఆ విజయం ఆషామాషీ కాబోదనడానికి సంకేతంగా తొలి రెండున్నర గంటల్లోనే టెన్షన్ తో కూడిన ఫలితాలు వచ్చాయి. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో అధికార టీఆర్ఎస్ కు లీడ్ లభించింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లుండగా, టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ముందుగా హుజూరాబాద్ మండలంలోని ఓట్లు లెక్కించగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ పొందారు.
హుజూరాబాద్ ఫలితం తొలి రౌండ్ లో బీజేపీకి 4610 ఓట్లు, టీఆరెఎస్ కు 4444 ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్, ఈటల రాజేందర్ మధ్య ఓట్ల తేడా 166 మాత్రమే కావడం ఉత్కంఠ రేపగా, రాబోయే రౌండ్లలోనూ ట్రెండ్ ఇలానే ఉంటుందనే టెన్షన్ అందరిలో నెలకొంది. కాంగ్రెస్ దాదాపు సీన్ నుంచి దూరమైనట్లుగా కనిపిస్తోంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 119 ఓట్లు దక్కాయి. అంతలోనే..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల రెండో రౌండ్ లోనైతే ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. రెండో రౌండ్ ముగిసే సమాయానికి బీజేపీకి 9,461, టీఆర్ఎస్ కు 9,103 ఓట్లు దక్కాయి రెండో రౌండ్ లో బీజేపీకి 192 ఓట్ల ఆధిక్యం దక్కింది. కాంగ్రెస్ కు మొత్తం కలిపి 339 ఓట్లే వచ్చాయి.
హుజూరాబద్ ఉప ఎన్నిక ఫలితాల కోసం.. కొవిడ్ నిబంధనల మేరకు రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటుచేశారు. ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లు సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తిచేయనున్నారు. ఒక్కో రౌండ్కు గంట సమయం పట్టవచ్చని రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డి చెప్పారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,36,873 మంది ఓటర్లు ఉండగా 2,05,236 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ జరుగుతున్న ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద 144 సెక్షన్ విధించారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడవద్దని గోయల్ స్పష్టంచేశారు. విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. గెలిచిన వారితో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు లోపలికి రావడానికి అనుమతి ఉంటుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Huzurabad, Huzurabad By-election 2021, Trs