గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది పరీవాహక అటవీ ప్రాంతంలో రహస్యంగా కోళ్ల పందాలను నిర్వహిస్తున్నారు. పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలలో రోజుకో స్థావరాన్నిమారుస్తూ పందాలను నిర్వహిస్తున్నారు. అయితే పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆకస్మికంగా దాడిచేసి పందెం రాయుళ్ల గుట్టును రట్టు చేశారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి కోటపల్లి మండలం దేవులవాడ, బబ్బెరచెల్క గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో 28 మంది పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి నాలుగు పందెం కోళ్ళు, ఐదు కత్తులు, ఏడు వాహనాలు, లక్షా 51 వేల రూపాయల నగదు, 26 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ నిందితుల్లో మంచిర్యాల జిల్లా దండెపల్లి, జన్నారం, మందమర్రి, మంచిర్యాల, వేమనపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్ల్ బెజ్జూరు, దహెగాం, పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందినవారు ఉన్నారు. తదుపరి విచారణ కోసం వారిని కోటపెల్లి పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ మహేందర్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ ,శ్రీనివాస్, రాకేశ్, శ్యామ్ సుందర్, కోటపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కాగ గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తూ అనేక మంది పట్టుపడ్డారు. సాధారణంగా కోడి పందాలు అంటే సంక్రాంతి పర్వదినాన కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా నిర్వహించే ఈ పందాలు తెలంగాణ జిల్లాలో ప్రతిరోజు ఓ దందాగా మారడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.