తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation ) సందర్భంగా గురువారం ఉదయం రాజ్ భవన్ ( Raj Bhavan)లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai ) పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో (speech in Telugu) ప్రసంగించారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తెలంగాణ ప్రజలకు తాను సేవ చేస్తానని కూడా తమిళిసై ప్రకటించారు. తాను రాష్ట్రానికి గవర్నర్ నే కాదు, మీ అందరికి సోదరిని అంటూ గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.
ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ..
తాను రాష్ట్రానికి గవర్నర్ గా సేవ చేస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తమిళిసై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదని చెప్పారు. ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తాను, కలుస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.
పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు..
‘‘తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి మోదీ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇందులో భాగంగా రాజ్ భవన్ స్కూలులో విద్యార్థుల కోసం భోజన ఏర్పాటు చేశాను. కొవిడ్ కాలంలో నిర్విరామంగా ప్రజారోగ్య విభాగాన్ని పర్యవేక్షించాను. భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆదివాసీ ప్రజలను కలిసి సహపంక్తి భోజనం చేశాను. అక్కడి ప్రజలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాను. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందించాను’’ అని తమిళిసై తెలిపారు.
ఆ వేడుకలకు తమిళిసై దూరం..
కాగా, అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana formation day) సంబురాలను పురస్కరించుకొని కేక్ ను గవర్నర్ కట్ చేశారు. కాగా, నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో (Nampally Public Gardens) నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తమిళిసై సౌందర రాజన్ దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆయన మంత్రివర్గ సహాచరులు ఎవరూ కూడా హాజరు కాలేదు. తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కేటీఆర్ సహా పలువురు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ తరువాత రాష్ట్రానికి వచ్చి భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు గవర్నర్ తమిళిసై. అయితే అక్కడ కూడా అధికారులు గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ను సరిగ్గా పాటించలేదనే విమర్శలు వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.