రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టింది ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. తుమ్మనూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థాలానికి వెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన కేశవులు(35), శ్రీనివాసులు(30), యాదయ్య(34), రామస్వామి(32)లుగా గుర్తించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి సొంతూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఓ ఆటోను పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మాడ్గుల మండలం కలకొండ పంచాయతీ సండ్రలగడ్డ తండాకు చెందిన నెనావత్ పత్యానాయక్(40), నెనావత్ అభిరాం(2), ఆమనగల్లు మండలం నుచ్చుగుంట తండాకు చెందిన వర్త్యావత్ శాంతి(45) ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో.. వారిని హైదరాబాద్కు తరలించారు.
జనగామ జిల్లా కూడా ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కేంద్రం శివారు ప్రాంతమైన పెంబర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఓ డీసీఎం వాహనం పంచర్ కావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి టైరు మారుస్తున్నారు. వెనుక వైపు నుండి వస్తున్న కారు అతివేగంగా వచ్చి టైరు మారుస్తున్న డ్రైవర్ అబ్దుల్ రహీమ్ను, పంచర్ షాప్ ఓనర్ కటారి శేఖర్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఢీ కొన్న సమయంలో డోర్ ఓపెన్ కావడంతో చిన్నారి శ్రీహిత కింద పడిపోయింది. తీవ్ర గాయాలయి ఆమె కూడా చనిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Rangareddy, Road accident