ఈటల రాజేందర్ రాజీనామా, అనంతర పరిణామాలపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన రాజీనామా పై మంత్రులు, స్థానిక పార్టీ నేతలు మినహా పార్టీ నుండి ఏం జరిగిందనే దానిపై అధికారకంగా పార్టీ అధ్యక్షుడు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ సైతం స్పందించలేదు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్టీ కార్యదర్శుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్తో పాటు,బీజేపీ పాదయాత్ర, షర్మిల పార్టీ ఏర్పాటు, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై పలు అంశాలను వివరించారు..ఇందులో భాగంగా ముందుగా హుజూరాబాద్ ఎన్నికలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న ఉప ఎన్నికలు వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్యే జరుగుతాయని స్పష్టం చేశారు.
కాగా పార్టీ వీడిన ఈటల రాజేందర్ది ఆత్మగౌరవం కాదని, ఆత్మవంచన అని అన్నారు.ఆయనకు పార్టీ ఏమేరకు సపోర్ట్ చేసిందో గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు.ఆయనకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఈటల ఆయనకు జరిగిన అన్యాయంపై ఏనాడు మంత్రి మండలిలో తన అసమ్మతిని వ్యక్తపరచ లేదని, మరోవైపు మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఆయన బహిరంగంగా విమర్శించారని అన్నారు. ఇక అయిదు సంవత్సరాల నుండి దూరంగా ఉంటే ఇన్ని సంవత్సరాలు మంత్రిపదవిలో ఎలా కొనసాగారని ప్రశ్నించారు. తాను సీఎంతో మాట్లాడనని చెప్పిన తర్వాత తాను ఏం చేయగలని అన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే చర్యలు తీసుకున్నారని అన్నారు. ఆయన తప్పు చేశానని ఒప్పుకున్నారని అన్నారు.తాను వ్యక్తిగతంగా ఈటల పార్టీలో ఉండేందుకు ప్రయత్నాలు చేశానని కాని..ఈటల స్టేట్మెంట్ తర్వాత తాను ఏం చేయలేకపోయానని అన్నారు.
ఇక నయా పార్టీ షర్మిలపై కూడ ఆయన సెటైర్లు వేశారు.మహిళలు వారంలో ఒకరోజు వ్రతాలు పూజలు చేసుకుంటారని..అలాగే షర్మిల కూడా వారానికి ఓసారి దీక్ష చేస్తుందని ఎద్దెవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడగలమని..ఏం మాట్లాడాలో తెలియక ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, KTR