తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ సాగు, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ మార్కు బాహుబలి బడ్జెట్ సిద్దమైంది. కేసీఆర్ సర్కారు గతేడాది(2021-22)కిగానూ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం విలువ రూ. 2.30 కోట్లు(కచ్చితంగా రూ.2,30,825.96 కోట్లు). అయితే ఈసారి దళిత బంధు లాంటి కొత్త పథకాలకు ప్రాధాన్యం కల్పించాల్సిన క్రమంలో 2022-23 వార్షిక బడ్జెట్ విలువ రూ.2.70కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రగతి భవన్ వేదికగా ఆదివారం సాయంత్రం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. అదే సమయంలో మంత్రుల్లో ఒకరు శాసన మండలిలోనూ రేపే బడ్జెట్ పెడతారు.
బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
మరికొద్ది గంటల్లో తెలంగాణ వార్షిక బడ్జెట్ ఆవిష్కృతం కానుండగా.. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో పాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ.. వంటి పథకాలకు ఈసారా బడ్జెట్ లో ఏమేరకు నిధులు కేటాయిస్తారా? వాస్తవ ఆదాయం ఆధారంగా ఆయా శాఖలకు కేటాయింపులు ఉంటాయా? రూపాయ రాక.. పోక ఎలా ఉంటుంది? అప్పుల బాట పట్టాల్సిందేనా? భూములు అమ్ముకోవాల్సిందేనా? సర్కారుకున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టనుండడంతో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
దళిత బంధుకు భారీగా
దళితబంధు పథకానికి కనీసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో బహిరంగ వేదికలపై వ్యాఖ్యానించిన దరిమిలా, ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అవుతుందనే అంచనాల నడుమ ఈ సారి బడ్జెట్ సుమారు రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్ల మధ్యలో ఉంటుందన్న చర్చ సాగుతోంది.
సంక్షేమానికి పెద్దపీట
ఇటీవలే భూముల అమ్మకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సానుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక శాఖ ‘భారీ’ కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ సారి బడ్జెట్ సుమారు రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్ల మధ్యలో ఉంటుందన్న చర్చ సాగుతోంది. సాగు, సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశం ఉండనుంది. ఈ సారి నిరుద్యోగ భృతికి తప్పకుండా నిధులు కేటాయిస్తారని, వాటి అంచనా రూ.3000 కోట్లని, ఏపీలో జగన్ విజయవంతంగా చేపట్టిన నాడు-నేడు తరహాలో కేసీఆర్ మొదలుపెట్టిన మన ఊరు-మన బడి పథకానికి కనీసం రూ.3000 కోట్లు కేటాయిస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు, వృద్ధాప్య పింఛను అర్హత వయసు 65 నుంచి 57 ఏళ్లతగ్గించి, ఆ మేరకు నిధుల కేటాయింపులూ ఉంటాయని తెలుస్తోంది. ఇక సాగు రంగానికి వస్తే..
సాగు రంగానికి విశేష ప్రాధాన్యం
సంక్షేమ పథకాలతోపాటు సాగు రంగానికి కూడా ఈ ఏడాది బడ్జెట్ లో భారీ కేటాయింపులు లభిస్తాయని అంచనా. తెలంగాణలో చిన్న కమతాలు, రైతుల సంఖ్య, రైతు బీమా ప్రీమియంల సంఖ్య క్రమంగా పెరిగిన నేపథ్యంలో రైతు బంధు పథకానికీ నిధుల కేటాయింపు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. రైతు బంధుకు ప్రస్తుతం కేటాయించిన రూ.14,800 కోట్లను రూ.20 వేల కోట్లకు పెంచే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖకు ప్రస్తుత బడ్జెట్లో రూ.16,931 కోట్లు కేటాయించగా.. కొత్త బడ్జెట్లో రూ.32 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. వైద్య ఆరోగ్య శాఖకు ప్రస్తుత బడ్జెట్లో రూ.6295 కోట్లను కేటాయించారు. కానీ, కొత్త బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది.
ఆదాయ మార్గాలు ఏవంటే..
బాహుబలి బడ్జెట్ ను రూపొందించిన సీఎం కేసీఆర్ ఆదాయ అంచనాల విషయానికొస్తే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, భూముల అమ్మకాలపైనే ప్రధానంగా ఆధారపడబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి గ్రాంట్లు ఇప్పటికే 87 శాతం వరకు వచ్చాయని, వచ్చే ఏడాది 97% అధికంగా రానున్నాయనే అంచనాలున్నాయి. భూముల అమ్మకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు, భూములు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ (దిల్) భూములను కేసీఆర్ సర్కారు అమ్మబోతోంది. వీటి కింద రూ.20 వేల కోట్ల రాబడిని సాధించాలన్న ఆలోచనతో ఉంది. ఇక భూముల మార్కెట్ విలువలను ఏడాదికోసారి పెంచాలని ఇదివరకే సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిని పెంచితే అదనంగా మరో రూ.3000 కోట్ల వరకు సమకూరతాయి. ఇవన్నీ కాకుండా ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ 4ు పరిమితితో అప్పు తీసుకోవడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.