( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18తెలుగు, ఖమ్మం జిల్లా )
కొన్నిమార్లు నేతలు చెప్పే మాటలు.. ఇచ్చే పిలుపులు వారికే సంకటంగా మారుతుంటాయి. నినాదాలు, ప్రసంగాల్లో చెప్పిన మాటలు వారికే మోకాలడ్డుపడే సందర్భాలు వచ్చిపడుతుంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ భూసేకరణ ప్రక్రియను చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 'నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ'.. అంటూ పిలుపునిచ్చిన అప్పటి ఉద్యమనేత, ఇప్పటి సీఎం కేసీఆర్ అనంతర తన పాలనాకాలంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
వద్దంటే పొలాలకు నీరందే పరిస్థితి నేడు తెలంగాణలో ఎటు చూసినా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక రైతు బంధు పథకం ఫలితంగా తెలంగాణలో ఎక్కడ చూసినా పొలం ఎకరం ముప్పై లక్షలకు తక్కువ లేదంటూ గత ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ ప్రస్తావించారు. ఇప్పటికీ అప్పుడప్పుడు చెబుతుంటారు. ఈ అంశం జనాల మెదళ్లలోకి బాగానే చొరబడినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల సభల్లోనూ, అప్పుడప్పుడూ కేసీఆర్ అలవాటుగా చెప్పే విషయాలే రైతులు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. చివరకు సర్కారు తమకు చెబుతున్న విషయాలనే రైతులు అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారని చెప్పొచ్చు.
కేంద్ర ఉపరితల రవాణ మంత్రి నితిన్గడ్కరీ కి చెందిన మహారాష్ట్ర లోని నాగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి దాకా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు ఇప్పుడు భూసేకరణ పెద్ద సమస్యగా మారింది. దీనికితోడు సూర్యపేట నుంచి అశ్వారావుపేట దాకా చేపట్టిన దేవరపల్లి నేషనల్ హైవే విస్తరణ కు సైతం భూసేకరణ సమస్యగా మారింది. ఈ రహదారి ఇప్పటికే సూర్యపేట నుంచి ఖమ్మం దాకా దాదాపు పూర్తయ్యే స్థితిలో ఉండగా.. ఖమ్మం నుంచి అశ్వరావుపేట దాకా ఇంకా భూసేకరణ ప్రక్రియకు అడ్డంకులు తొలగలేదు. ఖమ్మం నుంచి ఇప్పటికీ ఇంకా పనులు మొదలు కాలేదు. అలైన్మెంట్ పూర్తయినా, మార్కింగ్ చేసినా.. పనులు మాత్రం మొదలుపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా ఈ రెండు ప్రధాన జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియ పెద్ద సమస్యగా మారింది. తమ పంట పొలాల పక్కనుంచే నేషనల్ హైవే పోతున్నా తమకు న్యాయమైన నష్టపరిహారం లభ్యం కావడంలేదని రైతులు వాపోతున్నారు.
MLA Seetakka on RRR : ఇలా అనుకుంటే RRR ..లేదంటే కశ్మీర్ ఫైల్స్ చూడండి.. ఎమ్మెల్యే సీతక్క
బలవంతంగా పొలాల్ని లాక్కుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలా దాదాపు ఒక్క ఖమ్మం జిల్లాలోనే 107 కిలోమీటర్ల మేర ఉండే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు రెండువేల ఎకరాల భూమి కావాల్సి ఉంది. నాగ్పూర్- అమరావతి హైవే కోసం రఘునాథపాలెం, కొణిజెర్ల, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని భూములు సేకరిస్తున్నారు. ఏటా రెండు పంటలు పండే సారవంతమైన భూములు, ఇంకా గ్రానైట్, బైరేటిస్ లాంటి ఖనిజ నిక్షేపాలు, ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడో పాతరోజుల్లో సామాన్యులు కొనుగోలు చేసిన ప్లాట్లు రోడ్డులో పోయే పరిస్థితి ఉంది.
ఖమ్మం నగరానికి ఆనుకుని ఉండే కొత్త కలెక్టరేట్ ఉన్న వి.వెంకటాయపాలెం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో నాలుగు కోట్లకు పైగా ఉంది. కానీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం కేవలం ఐదు లక్షలే ఉంది. దీనికి మూడునాలుగు ఇంకా ఐదు రెట్లు చొప్పున పరిహారం ఇచ్చినా ఎకరానికి పాతిక లక్షలకు మించి రాని పరిస్థితి ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. దీనికితోడు చాలా ఎత్తులో నిర్మించే ఈ రోడ్ల వల్ల ఎక్కడా స్థానిక రోడ్లకు కనెక్టివిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో స్థానికులకు ఈ రహదారుల వల్ల పెద్దగా ఒనగూరేది ఏమీ లేదన్న వాదన కూడా ఉంది.
దీంతో ఎక్కడ చూసినా రైతులు తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. తమకు సరైన రేటు ఇవ్వకపోతే భూములు ఇవ్వమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. చాలాచోట్ల పర్యావరణ శాఖ ఏర్పాటు చేసే సమావేశాలు, భూసేకరణ సమావేశాలను బహిష్కరిస్తున్నారు. రెండురోజుల క్రితం మధిర మండలం సిరిపురం గ్రామంలో నిర్వహించిన భూసేకరణ సభను రైతులు అడ్డుకున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లో తమ పొలాలను ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ధర తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రైతులు తేల్చిచెబుతున్నారు. మొత్తంమీద చూస్తే ప్రభుత్వం చెబుతున్న ఎకరం ధర ఏభై లక్షలు సైతం తమకు దక్కడంలేదన్న ఆవేదన, ఆక్రోశం రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న సమయంలో రహదారుల నిర్మాణం కష్టమే. మరి రైతులతో సంప్రదింపులు చేసి రేటు పెంచి మరీ భూసేకరణ చేస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.