దిశా కేసులో ఎన్కౌంటర్ కాబడ్డ నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్పై సీబీఐ లేదా ఇతర ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, నష్టపరిహారం కింద తమ కుటుంబాలకు రూ.50లక్షలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని అనుసరించి.. నిందితుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించినందుకు పరిహారం కోరుతున్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్కి ముందు,ఆ తర్వాత.. కేసుకు సంబంధించిన మొత్తం ఫైళ్లను పరిశీలించాలని కోర్టును కోరారు. అంతేకాదు,ఎన్కౌంటర్లో సీపీ సజ్జనార్ పాత్రపై కూడా విచారణ జరిపించాలన్నారు. పిటిషన్లో కేంద్ర హోంశాఖ సెక్రటరీ,తెలంగాణ చీఫ్ సెక్రటరీ,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,ఎస్ఐ శ్రీధర్ కుమార్లను బాధ్యులుగా చేర్చారు. మృతులపై నమోదైన కేసులను రద్దు చేయాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా నిందితులను చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లగా.. తమ వద్ద గన్స్ను లాక్కుని
ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆత్మరక్షణలో భాగంగానే వారిపై
కాల్పులు జరిపాల్సి వచ్చిందని.. కాల్పుల్లో నలుగురు నిందితులు మహమ్మద్ ఆరిఫ్,జొల్లు శివ,జొల్లు నవీన్,చింతకుంట్ల చెన్నకేశవులు చనిపోయారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎక్కువమంది ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేయగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం ఎన్కౌంటర్ను వ్యతిరేకించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha, Disha accused Encounter, Telangana