ఈటలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి టీఆర్ఎస్ నాయకులు ఈటలపై ఎదో ఒక విధంగా టార్గెట్ చేస్తూ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తనపై వరుస విమర్శలు గుప్పిస్తున్న గంగులపై కౌంటర్గా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ఈటల మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో కరీంనగర్ సంపదను అంతా విధ్వంసం చేశావ్.. కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను.. గంగుల ఖబడ్దార్.. నా జోలికి వస్తే నీ బండారం మొత్తం బయటపెడతానంటూ తీవ్ర స్థాయిలో మంత్రిపై మండిపడ్డారు.
ఈటల మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా? ఇక్కడ ఎవరి గెలుపులో అయినా మీరు సాయం చేశారా ? తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలని అన్నారు. బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బతకరు.. అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నావ్.. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. నువు(గంగుల) ఎన్ని ట్యాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా? టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసంటూ గంగులపై ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ ఈటల వార్నింగ్ ఇచ్చారు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది.. అదే గతి నీకు పడుతుందని చురకలు అంటించారు. 2006 లో కరీంనగర్ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, YS రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు.
ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్ననంటూ మీడియా సమావేశంలో అతడిని విమర్శించారు. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారు. హుజురాబాద్ లో మా మిత్రుడికి ఇంఛార్జి ఇచ్చినట్టు తెలిసింది. కానీ మొన్న ఎంపీ ఎన్నికలలోనూ మిగతా అన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వేస్తే.. 54 వేల మెజారిటీ ఇచ్చి ఆదుకున్న నియోజక వర్గం హుజురాబాద్. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తా.. అంటూ మీడియా వేదికగా చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.