వచ్చే మూడేళ్ల కు గాను ఇంజనీరింగ్ (Engineering), వృత్తి విద్యా కోర్సులకు ఫీజులను నిర్ణయించడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రవేశాలు - ఫీజు నియంత్రణ కమిటీ (TSFRC) కసరత్తు చేస్తున్నాయి. వృత్తి విద్యా కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సమీక్షిస్తారు. కళాశాలల ఆదాయ (Income), వ్యయాలు, మౌలిక వసతులు, లేబొరేటరీలు, ఫ్యాకల్టీకి అయ్యే ఖర్చు బట్టి ఫీజులను నిర్ణయిస్తారు. 2019లో నిర్ణయించిన ఫీజు గడువు ఈ ఏడాది ముగియనుంది. దీంతో వచ్చే మూడేళ్లకు (2022-23 నుంచి ) కొత్త ఫీజులను (New Fees) నిర్ణయించాల్సి ఉంది. అయితే ఇంజనీరింగ్ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పట్టుబడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TSRFC) ముందు తమ వాదనను విన్పిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లకు అంగీకరిస్తుందా లేదా అనేది చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. అయితే తాజాగా ఈ ఉత్కంఠకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister Sabitha Indra Reddy) తెరదించారు.
అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు..
ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో (Engineering Colleges) వార్షిక ఫీజుల పెంపు నిలిపివేతపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అసలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనే ప్రభుత్వానికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా శుక్రవారం మంత్రి వద్ద ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఫీజులు పెంచాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ అన్నీ పరిశీలించాక అవసరమైన సిఫార్సులు చేస్తుందని వివరించారు.
కనిష్టంగా రూ. 45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షలు..
రాష్ట్ర అడ్మిషన్ల కమిటీ (టీఎస్ఎఫ్ఆర్సీ) ఇప్పటి వరకూ తమ దృష్టికి ఎలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని మంత్రి సబితా పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. యాజమాన్యాలతో చర్చించిన తర్వాత కనిష్టంగా రూ. 45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షల వరకూ ఫీజుల పెంపునకు సమ్మతించింది. అయితే, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈఏడాది పాత ఫీజులే అమలు చేయాలని భావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దిశగా నివేదిక పంపినట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాది ఫీజుల పెంపు ఉండదని అందరూ భావించారు. కానీ మంత్రి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఫీజుల పెంపు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కాలేజీలు కోరినట్టు ఫీజులు పెంచితే ఏటా రూ. 21 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇదే క్రమంలో రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ వచ్చే విద్యార్థులపైనా అదనపు భారం పడుతుంది. ఈ కారణంగానే తర్జన భర్జనపడుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Colleges, Engineering, Sabita indra reddy