ED Notices to MLC Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు మరోసారి విచారణకు రావాలని ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. దీనితో కవిత ప్రతినిధి సోమా భరత్ హుటాహుటీన ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే మూడు సార్లు విచారించింది. ఈనెల 11న మొదటిసారి విచారణ సమయంలో కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ తరువాత 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీకి స్టీల్ కవర్ లో అప్పగించారు. ఈ క్రమంలో ఆ ఫోన్లలో ఉన్న సమాచారం సేకరించేందుకు సాక్షిగా కవితను కానీ ఆమె ప్రతినిధిని కానీ రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత ప్రతినిధి సోమా భరత్ ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్లగా..ఆయన బయటకు వస్తే పూర్తి విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.
సుప్రీంలో కవిత పిటీషన్..కీలక ఆదేశాలు..
ఇదిలా ఉంటే ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరగగా ఇరువర్గాల వాదనలు వినిపించారు. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కవిత తరపున కపిల్ సిబాల్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు ఇచ్చిన నోటీసుల్లో ఇన్వెస్టిగేషన్ కు రమ్మని చెప్పారు. ఆమె నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్ కు ఎలా పిలుస్తారని కోర్టు దృష్టికి సిబాల్ తీసుకొచ్చారు.
ఈడీ విచారణ సరిగా లేదని..తనకు నోటీసులు ఇవ్వడం సరి కాదని..విచారణ సమయంలో తన ఫోన్ ను సీజ్ చేశారని కవిత పిటీషన్ లో పలు అంశాలను లేవనెత్తారు. ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో సూర్యాస్తమయం వరకు విచారించడాన్ని తప్పుబడుతూ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే PMLA చట్టం ప్రకారం ఈడీ అధికారులు ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు. అలాగే ఎంతసేపైనా విచారించవచ్చని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు సుప్రీంలో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కవితకు, ఈడీకి లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈడీ అధికారాలను ప్రస్తావిస్తూ..నళిని చిదంబరం పిటీషన్ తో కలిపి కవిత పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. మొదటగా ఆమెకు ఈనెల 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కవిత ఆరోజు విచారణకు హాజరు అయ్యారు. సుమారు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. అయితే ఒక మహిళను ఈడీ ఆఫీస్ లో రాత్రి వరకు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈడీ అధికారులు నిబంధనలకు లోబడి విచారణ జరపడం లేదని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అయితే 11న కవితను విచారించిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్న కారణంగా ఆ తీర్పు వచ్చే వరకు విచారణకు రాలేనని కవిత తన ప్రతినిధి ద్వారా ఈడీకి సమాచారం అందించారు. ఆరోజు నెలకొన్న హైడ్రామాతో విచారణ జరగలేదు. అయితే ఈనెల 20న విచారణకు రావాలని కవితకు మూడోసారి నోటీసులు ఇచ్చారు. దీనితో ఆమె విచారణకు హాజరు కాక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా విచారణకు రావాలని చెప్పగా..21న కూడా కవిత విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది.
ఇవాళ నాలుగోసారి కవితకు ఈడీ నోటీసులు ఇవ్వగా..ఆమె తరపున లీగల్ అడ్వైజర్ సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయన బయటకొస్తే గాని పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Kalvakuntla Kavitha, Telangana