(K.Lenin,News18,Adilabad)
ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గుస్సాడి నృత్య కళాకారుడు కనక రాజు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. అవార్డు స్వీకరించి తొలిసారి జిల్లాకు చేరుకున్న కనక రాజుకు పలు ఆదివాసి సంఘాల నాయకులు, ఆదివాసులు అడుగడుగున నీరాజనాలు పలికారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా మీదుగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన కనక రాజుకు జిల్లాలోని నేరడిగొండ వద్ద ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తోపాటు ఆదివాసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూరు మండలాల మీదుగా ఇంద్రవెల్లి మండలానికి చేరుకున్న కనక రాజు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో కొలువున్న ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకొని అక్కడి అమరవీరుల స్థూపం వద్ద ఘనం నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమురం భీం ప్రాంగణంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంకిత్, రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి పద్మశ్రీ కనక రాజును సాదరంగా ఆహ్వానించి పుష్ప గుఛ్ఛం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంకిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి ఆదివాసీ గుస్సాడి నృత్య కళను గుర్తించి గుస్సాడి నృత్య గురువు కనక రాజుకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడాం గిరిజనులకే కాక యావత్ జిల్లా ప్రజలందరికి గర్వకారణం అన్నారు. మారుమూల ఆదివాసి గ్రామం నుండి తమ సంప్రదాయాన్ని దేశానికి పరిచయం చేసిన కనకరాజు కు పద్మశ్రీ అవార్డు రావడం, తమ సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం అని ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆదివాసి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు.
Best Business Idea: కేవలం రూ. 9వేల పెట్టుబడి.. రాబడి రూ.కోటి.. అదేంటో ఓ లుక్కేయండి..
ఉట్నూరు నుండి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో స్వగ్రమం మార్లవాయి కి చేరుకున్నారు. మార్గమధ్యలో ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు కనక రాజును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కనక రాజుతోపాటు వెడ్మ బొజ్దు, ఆత్రం భుజంగ్ రావ్, ఆత్రం సుగుణ, మేస్రం భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Padma Awards