K.Lenin,News18,Adilabad
Marriage In Hospital: మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ జరగని సంఘటన మంచిర్యాల పట్టణంలో జరిగింది. పెండ్లి పీఠలపై జరగాల్సిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది. శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు. పెండ్లి మండపం లేదు. భాజా భజంత్రీలు లేవు. కుటుంబసభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు. నిరాడంబరంగా ఆసుపత్రిలో ఈ పెళ్లి జరిగింది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంకు చెందిన బానోథ్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయం అయింది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతికి తెలియడంతో కంగారుపడ్డాడు. ఇరు కుటుంబాలు పేదరికంలో ఉండడంతో మళ్లీ పెండ్లి ఏర్పాట్లు చేయడం అంటే ఖర్చు అవుతుందని భావించారు.
ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తంకు పెండ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరు కుటుంబసభ్యులను పెళ్ళికొడుకు ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు. బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారన చేసాడు.
ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. శైలజకు బుధవారం ఆపరేషన్ చేశామని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Mancherial, Marriage, Telangana