ఆకలిగా ఉందని సమీపంలోని ఓ హోటల్కు తినడానికి వెళ్లిన మునిసిపల్ కమిషనర్కు అక్కడి సిబ్బంది షాక్ ఇచ్చారు. ఆయనకు వేడి వేడిగా బొద్దింకలు కలిసిన బిర్యానీని హోటల్ నిర్వాహకులు వడ్డించారు. అప్పటికే ఆకలితో ఉన్న కమిషనర్ తన ప్లేట్లో బొద్దింకలు చూసి ఖంగుతిన్నారు. అసలు హోటల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తన సిబ్బందితో కలిసి వంటగది, తదితరాలను తనిఖీ చేశారు. హోటల్ను తనిఖీ చేసిన మునిసిపల్ కమిషనర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు హోటల్ యాజమాన్యం కొంచెం కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఆయన గ్రహించారు. వెంటనే హోటల్ని మూయించేశారు. మరోవైపు హోటల్ నిర్వాహకుల తీరుపై అక్కడికి తినడానికి వచ్చిన కస్టమర్లు సైతం మండిపడ్డారు. ఇటీవలె బిర్యానీలో పురుగులు రావడంతో మేడ్చల్ జిల్లా ఫిర్జాదీగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్యారడైజ్ పేరుతో నడుస్తున్న రెస్టారెంట్ను అధికారులు సీజ్ చేశారు. ఆ ఘటన మరిచిపోకముందే నిర్మల్ జిల్లాలో కమిషనర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింకలు రావడం చర్చనీయాంశమైంది.
వివరాల్లోకెళితే.. తెలంగాణలోని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, తన సిబ్బందితో కలిసి భోజనం చేసేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కు వెళ్లారు. ఆ హోటల్ పేరు లక్ష్మీ గ్రాండ్ హోటల్. పేరుకు తగ్గట్లే హోటల్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. తనకు సిబ్బందికి కలిపి కమిషనర్ చికెన్ బిర్యాని ఆర్డరిచ్చారు. కొద్దిసేపటికే హోటల్ సిబ్బంది కూడా వినమ్రంగా బిర్యానీ తెచ్చి వడ్డించారు. అసలే ఆకలిగా ఉన్న కమిషనర్, సిబ్బంది తినడానికి సిద్ధమయ్యారు. అయితే తన ప్లేట్లో బిర్యానీ చూసి కమిషనర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆయనకు వడ్డించిన బిర్యానిలో బొద్దింకలు, పురుగులు బయటపడ్డాయి. దీంతో ఆగ్రహించిన కమిషనర్ ఆ హోటల్లోని వంటగదిని సిబ్బందితో కలిసి తనిఖీ చేశాడు. అక్కడ పూర్తిగా కుళ్లిన, అపరిశుభ్రమైన మాంసాన్ని వండుతున్నట్లు గుర్తించారు. ఇక హోటల్ ఫ్రిజ్లో ఉంచిన చికెన్ కు బూజు పట్టి ఉండటం కమిషనర్ గమనించారు. అంతేకాకుండా కిచెన్లోని పలు ఆహార పదార్థాలు కలుషితమయ్యాయని గుర్తించారు. అదే ఆహారాన్ని వండి కస్టమర్లకు వడ్డిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వంటగది మొత్తం తిరిగిన కమిషనర్కు ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపించింది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చారు.
చర్యలు తప్పవు..
సాక్షాత్తూ కమిషనర్కే బొద్దింకలతో ఉన్న ఆహారాన్ని వడ్డించడంతో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అప్పటికప్పుడు హోటల్పై కమిషనర్ బాలకృష్ణ చర్యలు తీసుకున్నారు. లక్ష్మీ గ్రాండ్ హోటల్ను సీజ్ చేశారు. రూ.50 వేలు జరిమానా సైతం విధించారు. అంతేకాకుండా ఎవరైనా సరే హోటల్, రెస్టారెంట్లలో ఇలాగే నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగిస్తే సీజ్ చేస్తామని కమిషనర్హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Chicken biryani, Telangana