తెలంగాణ సచివాలయాన్ని వచ్చే నెల 30న ప్రారంభించాలని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దాదాపుగా పూర్తయిన సచివాలయానికి(Telangana New Secretariat) ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. కొత్త సచివాలయం భవనంలోని ఆరో అంతస్థులో ముఖ్యమంత్రి ఛాంబర్ను సిద్ధం చేస్తున్నారు. అదే ఫ్లోర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ కూడా ఉండనుంది. కొత్త సచివాలయంలోని అన్ని ఛాంబర్లలో కొత్త ఫర్నీచర్ను సిద్ధం చేస్తున్నారు. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎక్కడనే దానిపై క్లారిటీ వచ్చినా.. మిగతా మంత్రుల ఛాంబర్లు ఎక్కడ ఉంటాయనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashant Reddy) ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారని సమాచారం. పలువురు మంత్రులతో ఆయన ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక కొత్త సచివాలయానికి భద్రత కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఎస్పీఎఫ్తో సచివాలయానికి భద్రత కల్పించాలని అనుకుంటున్నా.. శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులకు ఈ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కూడా సీఎం కేసీఆర్(KCR) తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో.. సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇక అప్పట్లో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కేసీఆర్. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో వాయిదా పడింది. ఇప్పుడు జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి. ఇక ఇదిలా ఉంటే.. నూతన సచివాలయంలో గతంలో అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. సచివాలయం కింది అంతస్థులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు అప్పట్లో చర్యలు చేపట్టారు.
ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. జూన్ 27వ తేది 2019న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోపే సచివాలయం నిర్మాణం పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఈ సచివాలయం రూ.610 కోట్ల వ్యవయంతో రూపుదిద్దుకుంటోంది.
KCR-Karnataka: కర్ణాటక ఎన్నికల విషయంలో కేసీఆర్ ప్లాన్ ఏంటి ?
Yadadri Annual Income: యాదాద్రి నరసింహుడి ఏడాది ఆదాయం ఎంతో తెలుసా.. ఎన్ని రెట్లు పెరిగిందంటే..
నూతన సచివాలయం చూడగానే నిజాం కాలం నాటి కట్టడాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఈ డిజైన్ కోసం... ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. దశాబ్దాల కాలంపాటు నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ ఉండటంతో... అలనాటి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మించారు. మొత్తం 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయం రూపొందించారు. ఎత్తు 278 అడుగులు ఉండగా.. గ్రౌండ్ ఫ్లోర్తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మాణం చేపట్టారు. రూఫ్ టాప్లో స్కై లాంజ్ సచివాలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఆహ్లాదకరమైన పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పటిష్ఠమైన భద్రత మధ్య సచివాలయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇంతటి నిర్మాణం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Telangana secretariat