తెలంగాణకు అడుగడుగునా కేంద్ర సర్కారు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోన్న సీఎం కేసీఆర్ (CM KCR) తన పోరాటంలో పార్ట్-2 కోసం కీలక వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ హైదరాబాద్ (Hyderabad) గడ్డపై ధర్నా చేసిన సీఎం.. తాడో పేడో తేల్చుకుంటానంటూ గత వారం ఢిల్లీకి వెళ్లినా.. మూడు రోజుల పర్యటనలో కనీసం ఒక్కరిని కూడా కలవకుండా వెనుదిరిగారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ వేదికగా మోదీ సర్కారును ఇరుకునపెట్టేలా గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరుగనుంది. వరి ధాన్యంపై వివాదం, కొత్త విద్యుత్ చట్టం, నీటి వాటాలు, విభజన హామీలపై కేంద్రాన్ని ఎండగట్టేలా ఉభయ సభల్లో ఏమేం చేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతోన్న వివాదం మరింత ముందిరింది. ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని, వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్రం నిలిపేసిందనే ప్రచారం అసత్యమని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. అయినాసరే, రాష్ట్రంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయరాదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం తన ప్రకటనలో పేర్కొన్న అవగాహన ఒప్పందం అంశాల్లో తకరారు ఉందని తెలంగాణ సర్కారు వాదిస్తోంది.
ధాన్యం కొనుగోళ్లు ఆపలేదన్న కేంద్రం.. అవగాహన ఒప్పందం ప్రకారమే కొంటామని ప్రకటించడంతో అసలా ఒప్పందం ఏమిటనేది చర్చనీయాంశమైంది. 2019లో జరిగిన సదరు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ శాఖలు ఒకలా, ఎఫ్సీఐ మరోలా వ్యవహరిస్తున్నాయని సీఎం కేసీఆర్ వాదిస్తున్నారు. బాయిల్డ్ రైస్ విషయంలో వాటిని కొనబోమని స్పష్టం చేసిన కేంద్రం.. సాధారణ బియ్యాన్ని ఏ మేరకు కొంటారని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ బృందం పదే పదే అడిగిన ప్రశ్నలకు కేంద్రం పాత ఒప్పందాన్నే సమాధానంగా చెప్పింది. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఇలా చేస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనకుంటే ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రకటిస్తామన్న సీఎం కేసీఆర్.. ఢిల్లీ నుంచి తిరిగొచ్చి నాలుగు రోజులైనా ఆ దిశగా కదలకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. వరి వద్దని సూచించిన సీఎస్ సోమేశ్ కుమార్ సైతం ప్రత్యామ్నాయ పంటలుగా వేటిని పండించాలో క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఆదివారం నాటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వరి పోరు, నీటి వాటాలు, విద్యుత్ చట్టం తదిర అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేసిన తర్వాత, ప్రత్యామ్నాయ పంటలపై సీఎం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Paddy, PADDY PROCUREMENT, Parliament Winter session, Telangana, Trs