CM KCR LIKELY TO ANNOUNCE PADDY PURCHASE POLICY TODAY AFTER CABINET MEET AS MODI GOVT SAYS NO TO BOILED RICE MKS
CM KCR : రైతులకు శుభవార్త! -ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ ప్రకటన? -బీజేపీ ఖాతాలో మరో విజయం!!
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
రైతులకు ఊరట కలిగించేలా అన్ని రకాల ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఇవాళ శుభవార్త వెలువరించబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత ప్రగతి భవన్ వేదికగా జరగనున్న కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
తెలంగాణలో యాసంగి సీజన్ లో పండిన ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగువులాడుకోవడం, బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీగా ధర్నాలకు దిగడంతో రైతన్నల్లో ఆందోళన మరింత పెరిగింది. ధాన్యాన్ని మీరంటే మీరే కొనాలంటూ రెండు ప్రభుత్వాలు వాదనలు, పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో సీఎం కేసీఆర్.. కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించగా.. దానిపై స్పందించిన కేంద్రం.. బాయిల్డ్ రైస్ కొనేదేలేదని, రా రైస్(ముడి బియ్యం) ఎంతిచ్చినా కొంటామని క్లారిటీ ఇచ్చింది. కాగా, రైతులకు ఊరట కలిగించేలా అన్ని రకాల ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఇవాళ శుభవార్త వెలువరించబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత ప్రగతి భవన్ వేదికగా జరగనున్న కేబినెట్ భేటీలో కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుని, స్వయంగా ప్రెస్ మీట్ లో దానిని ప్రకటిస్తారని సమాచారం.
ధాన్యం కొనుగోలుపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం నాటి రాష్ట్ర కేబినెట్ భేటీ తర్వాత తెరపడే అవకాశాలున్నాయి. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని, రైతులను గంగలో కలిపేంత బలహీనంగా తెలంగాణ లేదని ఢిల్లీలోని నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన దరిమిలా ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు మద్దతు ధర, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాచరణను సీఎం ప్రకటించనున్నారు.
ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన సమాధానం చెప్పాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ విధించగా, కేంద్ర, ఆహార ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే, హైదరాబాద్లో ఎఫ్సీఐ రీజియన్ మేనేజర్ దీపక్ శర్మ సీఎం ప్రకటనపై స్పందించారు. బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టడంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల ధాన్యం సేకరణకు దాదాపుగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఇవాళ కేసీఆర్ చేయబోయే ప్రకటన రైతులకు శుభవార్త కానుంది.
తెలంగాణలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు మొదలుకాగా, ప్రైవేటు మిల్లర్లు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండానే వడ్లు కొంటున్న పరిస్థితి. ఊరూరా మళ్లీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసేలా ఇవాళ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మిల్లర్లతో ఒప్పందం ఉంటేనే వరి సాగు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో.. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మిల్లర్లకే కొనుగోలు బాధ్యత అప్పగిస్తే ఎలా ఉంటుందనే దిశగా కేబినెట్ చర్చించే అవకాశముంది. ప్రతి క్వింటాకు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తే ఎలా ఉంటుందనే అంశాన్నీ పరిశీలించనుంది.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారు ఎలాంటి పాజిటివ్ ప్రకటనలు చేసినా అది తమ విజయమేనని చెప్పుకోవడం రాష్ట్ర బీజేపీకి అలవాటుగా మారింది. 89వేల ఉద్యోగాల భర్తీకి సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయడం, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ తదితర నిర్ణయాలు తమ విజయాలేనని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గతంలో ప్రకటనలు చేశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు అంశంలోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర తగాదా నెలకొన్న క్రమంలో కేసీఆర్ ఇవాళ చేయబోయే ప్రకటనను కూడా బీజేపీ మరో విజయంగా ప్రచారం చేసుకునే అవకాశాలు లేకపోలేవు. అయితే బీజేపీకి ఆ అవకాశం దక్కనీయకుండా ముందు కేంద్రం తప్పులను, బీజేపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టిన తర్వాతే ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.