తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తాన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో అధికార టీఆర్ఎస్ భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే వారం రోజులపాటు హస్తిన వేదికగానే యుద్ధకార్యాచరణ నడుపనున్నారు. దేశ రాజధాని వేదికగా వరి పోరును ఉధృతం చేయనున్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈనెల 11న ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన గులాబీబాస్ మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. వివరాలివే...
వరి పోరు విషయంలో ఎంత వరకైనా వెళతానని, మోదీ సర్కార్ మెడలు వంచేదాకా నిద్రపోనని ఇదివరకే స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ ఉద్యమ కార్యచరణతోపాటు సొంత పనుల నిమిత్తం రాబోయే వారం రోజులూ దేశ రాజధానిలోనే మకాం వేయనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీ బయల్దేరారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు.
వరి పోరులో భాగంగా టీఆర్ఎస్ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన దరిమిలా సీఎం కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా ఎంపీలకు, ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో భారీ నిరసన చేపట్టనున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సోమవారం మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, బుధవారం(6న) జాతీయ రహదారులపై రాస్తారోకో, గురువారం (7న) హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, శుక్రవారం (8న) గ్రామాల్లో కేంద్రం దిష్టిబొమ్మల దహనం, ఇళ్లపై నల్లా జెండాల ఎగురవేత, ఆపై వచ్చే సోమవారం(ఏప్రిల్ 11న) సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన దీక్షకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.
ఢిల్లీలో జరగబోయే దీక్షలో సీఎం కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు మేయర్లు, టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొంటారు. కాగా, వరి పోరును ఉధృతం చేయడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ వీలైతే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ సీఎంవో వర్గాలు కోరాయి. రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కు మోదీ టైమిస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
వారం రోజులకుపైగా ఢిల్లీలో గడపనున్న సీఎం కేసీఆర్ ఓ వైపు వరి పోరు సాగిస్తూనే, ధాన్యం అంశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ కూడగట్టనున్నారు. ఎంపీ సంతోష్కుమార్ ఇప్పటికే జైపూర్ టూర్లో ఉన్నారు. జైపూర్ నుంచి ఆయన నేరుగా డిల్లీకి వెళ్తారు. ఇదిలా ఉంటే, వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం పై టీఆర్ఎస్ నేతలు ఉద్యమం చేస్తామనడం హాస్యాస్పదమని, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వట్టి పొలిటికల్ స్టంట్ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.