బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధ ప్రకటన తర్వాత కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా సాగుతోన్న విభేదాలు మరింత ముదరడం, తెలంగాణ రుణ సేకరణ (Telangana Borrowings)పై కేంద్రం ఆంక్షలు విధించడం, దాంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడం తెలిసిందే. ఈ వ్యవహారంలో తుది అంకంగా తెలంగాణకు కేంద్రం భారీ షాకిచ్చింది.
ఈ (2022-23 )ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ సర్కారు సేకరించ తలపెట్టిన బడ్జెట్ అప్పులో రూ.19 వేల కోట్లకు మోదీ సర్కార్ కోత పెట్టింది. ఒక్క విద్యుత్ ప్రాజెక్టులకు తప్ప కార్పొరేషన్ల పేరిట రాష్ట్రం తీసుకోవాలనుకున్న గ్యారంటీ అప్పులకైతే కేంద్రం పూర్తిగా తలుపులు మూసేసింది. వివరాలివే..
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.52,167 కోట్లు అప్పుగా తీసుకోవాలని కేసీఆర్ సర్కారు వార్షిక్ బడ్జెట్లో పొందుపరిచింది. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ అప్పులపై కేంద్రం సైతం స్టాండ్ మార్చుకుంది. గత రెండేళ్ల బడ్జెట్ అప్పుతోపాటు గ్యారంటీ అప్పులను కూడా ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలోకి తీసుకొస్తామని.. పరిమితికి మించి చేసిన అప్పునంతా లెక్కించి, ఈ ఏడాది బడ్జెట్ అప్పుల్లో అంత మేర కోత విధిస్తామంటూ కేంద్రం ఈసారి ఆంక్షల మెలిక పెట్టడంతో రాష్ట్ర అప్పులపై సందిగ్ధత ఏర్పడింది. ఎఫ్ఆర్బీఎం నిబంధన ప్రకారం జీఎస్డీపీలో 3.5 శాతం మేర.. అంటే రూ.42,728 కోట్ల దాకా ఈ ఏడాది అప్పు చేసేందుకు తెలంగాణకు అర్హత ఉంటుందని కేంద్రం లేఖ రాసింది.
కేంద్రం తాజా నిర్ణయంతో ఈ ఏడాది కేసీఆర్ సర్కారు అంచనా వేసిన బడ్జెట్ అప్పులో రూ.19 వేల కోట్ల దాకా కోత పడనుంది. రూ.52,167 కోట్లలో రూ.19 వేల కోట్లు తగ్గితే.. రూ.33,167 కోట్ల దాకా (ఇంచుమించు రూ.34 వేల కోట్ల దాకా) అప్పు రావచ్చని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఇక గ్యారంటీ అప్పుల విషయానికి వస్తే.. ఇరిగేషన్ కార్పొరేషన్ పేర తీసుకోవాలనుకున్న అప్పు రాకపోవచ్చుగానీ, విద్యుత్తు సంస్థల ద్వారా రూ.12,198 కోట్ల గ్యారంటీ అప్పు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
నిజానికి అప్పుల విషయంలో కేంద్రం ఒక్కో రాష్ట్రానికీఒక్కో విధానాన్ని అవలంబిస్తోందని కేసీఆర్ సర్కారు ఆరోపిస్తున్నది. పంజాబ్ వంటి రాష్ట్రాలు జీఎ్సడీపీలో 60 శాతం మేర అప్పులు తీసుకుంటున్నాయని.. తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎంలో 25 శాతంలోపే ఉంటున్నాయని, అయినా కూడా తెలంగాణపై కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్రం ఆరోపిస్తున్నది.
కేంద్రం కోతల తర్వాత రాష్ట్రానికి దక్కే అప్పు రూ.34 వేల కోట్లుగా నిర్ధారణ కాగా, అందులో రూ.10వేల కోట్ల అప్పును ఇప్పటికే తెలంగాణ సేకరించింది.సెక్యూరిటీ బాండ్ల తనఖా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తాజాగా మరో రూ.3000 కోట్ల రుణాన్ని సేకరించింది. దీంతో కలిపి కేసీఆర్ సర్కారు ఇప్పటి దాకా పొందిన రుణం రూ.10 వేల కోట్లు అయింది. కోత పడిన అప్పులను ఏ రూపంలో సర్దుబాటు చేసుకోవాలనేదానిపై సీఎం కేసీఆర్ సమాలోచనలు చేయనున్నారు. స్థానికంగా పన్నులు పెంచడం ఒక ఆప్షన్ అయినప్పటికీ, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా, ప్రత్యామ్నాయ మర్గాలను అణ్వేషిస్తారా? అనేది వెల్లడికావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Centre government, CM KCR, Financial year, Pm modi, Telangana, Telangana Budget 2022, Trs