Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తెలంగాణ (Telangana) నుంచి మరో రెండో గ్రామాలు తనకు కావాలని అడుగుతోంది. ఈ మేరకు కేంద్రం దగ్గర ప్రతిపాదనలు పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత బ్యాక్ వాటర్ లోమునుగుతాయనే కారణంతో కేంద్ర ప్రభుత్వం స్వీయ నిర్ణయంతో ఏడు మండలాలను, 136 గ్రామాలను, 211 గూడెంలను తెలంగాణ రాష్ట్ర అవతరణ కంటే ముందే (జూన్ 2, 2014) తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్ లోకలిపింది. తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు రెవెన్యూ గ్రామంతో పాటు నాగి నేనిప్రోలు(రెడ్డిపాలెం) అనే మరో గ్రామాన్ని తమకు ఇచ్చేయాలని ఏపీ ఆడుగుతోంది. పోలవరం ముంపునే కారణంగా చూపడంతో బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణలో ముంపు ఉండబోతన్నట్లు పరోక్షంగా ఏపీ సర్కారు అంగీకరించినట్లు అయ్యింది.
పోలవరం బ్యాక్ వాటర్ తో భారీగా ముంపు ముప్పు ఉందని తెలంగాణ పదే పదే కేంద్రం వద్ద నివేదించడంతో పాటు ముంపు నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. ముంపు పచ్చి అబద్ధమని వాదిస్తూ వచ్చిన ఏపీ, తాజాగా వాస్తవమేనని అంగీకరిస్తోంది. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం బూర్గంపాడు రెవెన్యూ గ్రామంలోని 350 ఎకరాలు, నాగినేని ప్రోలు (రెడ్డిపాలెం) గ్రామంలో 240 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ గ్రామాలను తమకిచ్చేయాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ముంపు ముప్పు పేరిట తీసుకున్న పంచాయితీల్లోఐదింటిని (ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ అడుగుతోంది.
పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై ఢిల్లీలో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద సాంకేతిక సమావేశం జరుగనుంది. తెలంగాణతో పాటు ఒడిసా, ఛత్తీస్ గఢ్, ఏపీ అధికారులు హాజరు కానున్నారు. బూర్గంపాడు, నాగినేనిప్రోలు గ్రామాలను ఏపీలో కలపాలనే ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ ముంపు విషయంలో తెలిపిన అభ్యంతరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగుల దాకా నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 891 ఎకరాల సాగుభూమి నీట మునగనుంది. 2013 భూసేక రణ చట్టం అనుసరించి.. పునరావాసం, పునర్ నిర్మాణ ప్యాకేజీని ఇవ్వాలి. అంతేకాకుండా ప్రాజెక్టులో 150 అడుగుల దాకా నీటిని నిల్వ చేసినప్పుడు పినపాక, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని 35 ఉప నదుల(కిన్నెరసాని, ముర్రేడువాగు, జంపన్నవాగుతదితర) ప్రవాహానికి ఇబ్బందులు వస్తాయి. గోదావరి నుంచి ఆ నదుల ప్రవాహం వెనక్కితన్నే అవకాశం ఉంది. అదే జరిగితే 40 వేల ఎకరాలు, మణుగూరు భారజల కర్మాగారం ముంపునకు గురవుతాయి. వీటి రక్షణకు గోడల నిర్మాణం జరగాలి. అంతేకాకుండా బ్యాక్ వాటర్ముంపుపై అధ్యయనం శాస్త్రీయంగా జరగలేదు. తెలంగాణ, ఏపీ, సీడబ్ల్యూసీలతో సంయుక్తసర్వే నిర్వహించాలి.
గత 20 ఏళ్లలో నదిలో చోటు చేసుకున్న మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. మరియు పోలవరం ప్రాజెక్టుకు 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే దానిపై అధ్యయనం చేయాల్సిందే. ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కూడా మహారాష్ట్ర అభ్యంతరాల మేరకు అత్యధిక వరద ప్రవాహం అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తుంది. అంతేకాకుండా గత ఏడాది2022 జూలై వరదల సందర్భంగా వచ్చిన నీటిపై సీడబ్ల్యూసీ, ఏపీ నివేదికల్లో తేడాలున్నాయి. పోలవరం ఎగువన భూపాలపట్నం, ఇచ్చంపల్లి బ్యారేజీలు కడతారని, వరదతో పాటు వచ్చే సిల్డ్ పోలవరం వరకు రాదని బచావత్ ట్రైబ్యునల్లో రాశారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత భూపాలపట్నం, ఇచ్చంపల్లి బ్యారేజీలు కట్టడం లేదు. అంటే ఎగువన వచ్చే మట్టి, ఇసుక, కంకర అంతా పోలవరంలో పూడికగా మారనుంది. ఇసుక దిబ్బలు పెరిగితే తెలంగాణలో మునక పెరుగుతుంది. దీన్ని పరిష్కరించాలంటే పోలవరం స్పిల్వే నిర్మాణంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bhadradri kothagudem, Local News, Telangana