Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం (Bhadrachalam) లో గురువారం నిర్వహించిన విశ్వరూప సేవలో సర్వదేవతలం కారాలను తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో ఓలలాడారు. "అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం" అంటూ దేవస్థానం విద్వాంసులు కీర్తనలను ఆలపిస్తుండగా సకల దేవతా అలంకారం (విశ్వరూప సేవ) నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో ఉత్సవమూర్తులందరినీ ఒకేచోట చేర్చి ఆరాధాన నిర్వహించడం భద్రాద్రి దేవస్థానంలో ప్రత్యేకత. ఈ సమయంలో ఆలయంలోని 108 దేవతామూర్తులను ఒకేచోటకు చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాద్రి కలియుగ వైకుంఠమైంది. అంత రామమయం, ఈ జగమంతా రామమయం అన్న రామదాసు కీర్తనలో భాగంగా రాముడే విశ్వరూపుడిగా భావించి ఆలయంలోని వరాహస్వామి, వేంకటేశ్వరస్వామి, కృష్ణుడు తదితర ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించారు.
గరుడ వాహనంపై శ్రీరాముడు ఆసీనులు కాగా సాయంకాలం సమయంలో ఆయన సన్నిధిలో ఇతర ఉత్సవమూర్తులకు ఆరాధాన నిర్వహించి 'కదంబం' అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేశారు. సీతారామచంద్రస్వామికి రాపత్తు పూర్ణ సేవ భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి చిత్రకూటమండపంలో రాపత్తు పూర్ణ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు హాజరై భక్తులనుద్దేశించి ప్రవచనం చేసారు.
వేదానికి రూపమే రామాయణమని, వేదం మర్మాన్ని తెలియజేసే అంశాలు రామాయణంలో ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే భగవంతుడు పూర్ణ స్వరూపుడని, మానవుడు భగవంతునిలో లీనమ వడమే పూర్ణత్వమని పేర్కొన్నారు. అలాగే రావత్తు ముగింపు సేవను రాపత్తు పూర్ణసేవ అంటారని, ఈ సేవ తరువాత పరమప దోత్సవం-పూర్ణ శరణాగతితో రావత్తు సేవలు ముగుస్తాయని వివరించారు.
నమ్మాశ్వారులు నాయికాలంకారంలో దర్శనమివ్వడం పూర్ణసేవలో ప్రధాన విశేషమని భక్తులకు వివరించారు. ఇదిలా ఉండగా భద్రాచలం దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జనవరి 12తో ముగిశాయి. డిసెంబరు 23న అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా తొలుత పది రోజుల పాటు పగల్పత్తు, అనంతరం పది రోజులు రాపత్తు ఉత్పవాలను నిర్వహించారు. అనంతరం మూడు రోజుల పాటు విలాసోత్సవాలు జరిగాయి. ఇదిలా ఉండగా జనవరి 19న స్వామి వారికి విశ్వరూప సేవ నిర్వహించారు.
అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష సేవ చేయడంతోపాటు రోజుకొక ప్రదేశంలో రాపత్తు సేవ నిర్వహించారు. అధ్యయనోత్సవాలను ప్రజలు కనులారా వీక్షించి, తరించారు. కార్యక్రమంలో భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి నీలిమ, దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవోలు శ్రావణిక్కుమార్, భవానీరామకృష్ణారావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన ఆర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘ వన్, వైదిక పరిపాలన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana