Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఒకప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీ అడవుల్లో తునికాకు సేకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని గిరిజనులు ఎదురు చూసేవారు. అటవీశాఖ గ్రామాల్లో డప్పు ప్రచారం చేసిన వెంటనే ఆకు సేకరణకు అడవికి వెళ్లేవారు. మరికొందరు ముందుగానే.. అదీ రాత్రి వేళ్లల్లో కోతలు కోసేవారు. చిన్నా పెద్దా ఆకు సేకరణలో పాల్గొని కుటుంబాన్ని పోషించుకునేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. భద్రాచలం ఏజెన్సీ అటవీ గ్రామాల్లోని గిరిజనులు ఆకు సేకరణపై ఆశక్తి చూపడం లేదు. ఆకు సేకరణ చేసే కన్నా, ఇతర పనులు చేసుకుంటే చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు ఆకు సేకరణ వెళ్లకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 50 ఆకుల తునికాకు కట్టకు అటవీశాఖ రూ. 3ధర చెల్లిస్తోంది. ఈ నగదు సరిపోదని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చెల్లిస్తున్నట్టుగా రూ. 6 చెల్లించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నాణ్యమైన తునికాకు సరిహద్దు అడవుల్లో కనిపించడం లేదని తెలుస్తుంది. పోడు వ్యవసాయం కారణంగా చెట్లు, మోట్లును కొందరు రైతులు తొలగించారు. దీంతో ఆకు దగ్గరల్లో దొరక్క పోవడంతో కొంత మంది సేకరణకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇతర పనులకు వెళ్లితే రోజుకు రూ.400 నుంచి రూ.600 వస్తుండగా.. ఆకు సేకరణకు వెళితే ప్రస్తుత ధర ప్రకారం రూ.300 కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా నగదు చేతికి అందడం కూడా ఆలస్యమవుతుంది. దీంతో తునికాకు సేకరణకు గిరిజనులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని ఒక్క చర్లమండలంలోనే ఈ ఏడాది 32 కల్లాల ద్వారా 2,377 స్టాండర్డ్ బ్యాగుల సేకరించాలని ఆటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ఏడాది 32 కల్లాలకు చర్ల సెక్షన్లోని రేగుంట, గన్నవరం కాలనీ, కందిపాడు, వెంకటచెరువు, బూరగపాడు గ్రామాల్లోని కల్లాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇక్కడ కూడా ఆకు సేకరణ మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇతర గ్రామాల్లో కూడా మరి కొద్దిరోజుల్లో నెమ్మదిగా ఆకు సేకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా 32 కల్లాలు ప్రారంభమవకపోతే అటవీశాఖ లక్ష్యం ఈ ఏడాది నేరవేరక పోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ముల్గే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని పంచుకుంటున్న పక్కనే ఉన్నఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అలజడి సృష్టించారు.
తునికాకు ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటివలే కల్లానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా గోండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతంజర్ గ్రామం వద్ద అటవీ శాఖ అధికారులు తునికాకు కల్లాన్ని ఏర్పాటు చేయగా... కొద్ది రోజులుగా గిరిజనులు తునికాకు సేకరించి అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోఅక్క డికి చేరుకున్న మావోయిస్టులు కల్లంలోని తునికాకు కట్టలకు నిప్పు పెట్టారు. 50ఆకులు కట్టకు మద్దతు ధర చెల్లించాలని, ఎన్ని సార్లు కాంట్రాక్టర్లకు చెప్పినా పట్టించు కోవడం లేదని, మద్దతు ధర చెల్లించక పోతే శిక్ష తప్పదని అక్కడ ఓ లేఖ వదిలారు. ఈ ఘటనతో అధికారులు, కాంట్రాక్టర్లు భయాందోళన చెందారు. పోలీసులు గాలింపుని ముమ్మరం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana