లోకోత్తముడు, ఆదర్శప్రాయుడు, ఏకపత్నీవ్రతుడుగా పేరు గడించిన రాముడికి సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు భద్రాచల అర్చక స్వాములు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామికి శుక్రవారం సామ్రాజ్య పుష్కర మహాపట్టాభిషేక వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజలాంఛనలతో నిర్వహించిన ఈ వేడుకను తిలకించిన భక్తజనకోటి పరవశించింది. పట్టాభిషేకం అనంతరం పండితులు నదీ జలాల మహాకుంభతీర్ధ ప్రోక్షణతో భక్తులు పునీతులయ్యారు. నవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారామచంద్రస్వామి కళ్యాణం, మరుసటి రోజున స్వామివారికి నిర్వహించిన సామ్రాజ్య పుష్కర మహాపట్టాభిషేకం ఈ రెండు క్రతులు విజయవంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
గురువారం జరిగిన కళ్యాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక శుక్రవారం జరిగిన సామ్రాజ పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరై పట్టాభిషేక రామయ్యకు పట్టువస్త్రాలను సమర్పించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ కు దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో సంప్రదాయబద్ధంగా వేదమంత్రాలతో, మేళాతాళాలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన "అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సమయంలో అర్చకులు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించి, దేవస్థానం తరపున సంప్రదాయంగా వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు.
అత్యంత ఘనంగా సాగిన పట్టాభిషేకం
నూతన దంపతులైన సీతారామచంద్రస్వాముల వారిని సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం మహోత్సవ అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి 12 నెలలకు ఒకసారి వచ్చే క్రతువులు దేవస్థానం అర్చక స్వాములు శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి వారిని మిధిలా స్టేడియంలోని శిల్పకళాశోబిత కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఉదయం 10 గుటల నుంచి పట్టాభిషేక తంతు సాగగా.. ఆరాధన అనంతరం వేద స్వష్టితో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విశ్వక్ష్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు కె.ఈ స్థలశాయి శ్రీరామ సామ్రాజ్య పుష్కర మహా పట్టాభిషేక విశిష్టతను భక్తులకు వివరించడం అందరిని ఆకట్టుకొంది. రామాయణ కధను గుర్తుకు తెస్తూ అలగాడు మహా సామ్రాజ్య పుష్కర పట్టాభిషేక వైభవాన్ని గుర్తు చేశారు. దేశంలో దేవతలు ఎంతో మంది ఉన్నా అందరు కళ్యాణానికి మాత్రమే పరిమితం తప్ప పట్టాభిషేక వైభవం మన శ్రీరామునికి మాత్రమేనని రాముని గొప్పతనం, పరిపాలనా దక్షతను ఈసమయంలో వారు వివరించారు.
ఇదిలా ఉండగా శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం ఘట్టంలో భాగంగా భద్రాద్రి రామయ్యకు ఒక్కొక్క ఆభరణాలను, వాటి విశిష్టతను వివరిస్తూ భక్తి ప్రపత్తులతో అర్చక స్వాములు సమర్పించారు. తొలుత శ్రీరామ బంగారు పాదుకలు, ఆ తరువాత రాజనీతిని తెలియజేసే రాజదండం, రాజముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరామునికి చింతాకు పతకం సీతమ్మకు, లక్ష్మణస్వామికి శ్రీరామమడ, బంగారు చత్రం, తదితర ఆభరణములను రామయ్యకు సమర్పించారు. అనంతరం లాంఛనంగాసామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేయగా, భక్తజనకోటి కరణాల ధ్వనులతో రామయ్యకు జేజేలు పలికారు. తర్వాత దేవేంద్రుడు కానుకగా పంపినట్లుగా చెప్పే ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తికి. ఆ తరువాత సీతమ్మ తల్లికి చివరగా రామభక్తి సామ్రాజ్యానికి రారాజైన హడుమంతునికి సమర్పించి ప్రోక్షణ గావించారు. వేద ఆశీర్వచనం, అష్టోత్తర శతహారతి సమర్పించడంతో పట్టాభిషేకం సుసంపన్నమైనది. ఈ పట్టాబిషేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై పాల్గొన్నారు.
పట్టాభిషేకాన్ని తిలకించడం నా పూర్వజన్మ సుకృతం అని గవర్నర్ తమిళసై అన్నారు. శ్రీరామచంద్రుని సత్య పరిపాలకుడని భద్రాచలంలో ఆయనకు జరిగిన మహా సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని తిలకించడం తన పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నానని గవర్నర్ తమిళపై పేర్కొన్నారు. పట్టాభిషేక వేడుకను తిలకించిన అనంతరం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. శ్రీరాముడు చూపిన మార్గం సర్వదా ఆచరణీయమని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భద్రాద్రి రామయ్యను మనస్పూర్తిగా కోరుకున్నానన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana