(Kranthi Kumar, News 18, Bhadradri)
తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన శ్రీ సీతారాముల కల్యాణం, ఆ తెల్లవారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు జోరందుకున్నాయి.
మిథిలా స్టేడియంలో షామియానాలు, చలువ పందిళ్ల నిర్మా ణ పనులు వేగంగా సాగుతున్నాయి. దేవస్థానానికి పూర్తిస్థాయిలో విద్యుదీకరణ పనులు పూర్తి కావచ్చాయి. నవమి ఏర్పాట్ల పనులను కలెక్టర్ అనుదీప్, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎల్.రమాదేవి ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి న్యూస్ 18 తో మాట్లాడుతూ..
శ్రీరామనవమికి వచ్చే భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలు తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తానీషా కల్యాణ మండపంలో లడ్డూల తయారీ ప్రక్రియ శనివారం ప్రారంభమైందని అన్నారు. దేవస్థాన సిబ్బందితో పాటు విజయవాడ నుంచి వచ్చిన కార్మికులు లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థల సభ్యులు తలంబ్రాలు తయారు చేస్తున్నారని దాతలు సమర్పించిన మిషన్లతో ఈ ఏడాది తొలిసారిగా ముత్యాల తలంబ్రాలను ప్యాకింగ్ చేస్తున్నారని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రతి ఏడాది శ్రీరామ నవమి తెల్లవారి జరిగే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ హాజరు కావటం పరిపాటి. కాగా, ఈనెల 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పర్యటన ఖరారైనట్లు సమాచారం.
పట్టాభిషేకం అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల క్షేత్రాన్ని సైతం గవర్నర్ దర్శించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ , ఏపీ రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులకు రాజభవన్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఇక శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి ఈ ఏడాదైనా సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. జిల్లా, ఆలయ అధికారులు మాత్రం సీఎం పర్యటనకు తగినట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్రీరామ ఏర్పట్ల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ శ్రీరామనవమి సందర్భంగా చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మిథిలా స్టేడియం, ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తులు సెక్టార్లోకి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు వారికి ఏ సమస్యా రాకుండా చూడాల్సిన బాధ్యత ఇన్చార్ట్లుగా నియమించిన ప్రత్యేక అధికారులదేనని స్పష్టం చేశారు. నవమి, పట్టాభిషేకం వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు. తలెత్తకుండా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana