(D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
మావోయిస్టు పార్టీ (Maoist party) నాయకులు విచక్షణ కోల్పోయి, వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఏజెన్సీ ప్రాంతంలోని అమాయక ఆదివాసి ప్రజలను వాడుకుంటున్నారని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ డా. వినీత్.జి అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల అరెస్టయిన చర్ల ఏరియా కమిటీ మెంబెర్ రజితను తాము విచారించామని, మావోయిస్టుల దుర్బుద్ధి ఏంటో, ఆదివాసీల పై వారి దుశ్చర్యలు ఎందుకో రజిత తమ విచారణలో స్పష్టంగా వివరించిందని ఎస్పీ (SP) వినీత్.జి వెల్లడించారు.
తెలంగాణ స్టేట్ మావోయిస్ట్ పార్టీ కమిటీ నాయకుడైన కొయ్యడ సాంబయ్య (Sambaiah) అలియాస్ ఆజాద్.. మావోయిస్టు పార్టీలో కొత్తగా చేరిన యుక్త వయసులో ఉన్న ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడుతూ ఉండేవాడని, పార్టీలో పనిచేసే మరికొందరు మహిళలను మానసికంగా వేదించేవాడని రజిత స్పష్టంగా వివరించిందని జిల్లా ఎస్పీ (SP) తెలిపారు. అమాయకపు ఆదివాసి గిరిజన మైనర్లను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటూ వారి చేత కాంట్రాక్టర్ల వద్ద నుండి డబ్బులు వసూలు చేయిస్తున్నాడని అన్నారు.
ఆజాద్ (Azad) ఆకృత్యాలను తెలుసుకున్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు అతనిని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవద్దని హెచ్చరించినట్లు తమ వద్ద సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. ఆజాద్, దామోదర్, ఇతర నాయకులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ..స్థానికంగా తునికాకు కూలీలు, కాంట్రాక్టర్లు, రైతులు, ట్రాక్టర్ - ఆటోల ఓనర్లు పేద ఆదివాసీల నుండి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు రజిత తమ విచారణలో తెలియజేసిందని జిల్లా ఎస్పీ వివరించారు.
నిత్యవసరాలు, డబ్బును బలవంతంగా తెప్పించుకుని..
ఏజెన్సీ ప్రాంతంలోని మైనర్లతో బట్టలు ఉతికించడం, వంట చేయించడం వంటి పనులు చేయించుకుంటున్నారని.. సరిహద్దు గ్రామాల్లో కష్టపడి పనిచేసుకునే ఆదివాసీల నుండి బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యవసరాలను, డబ్బును బలవంతంగా తెప్పించుకుని వాటి ద్వారానే మావోయిస్టులు జీవితాన్ని గడుపుతున్నారని రజిత తెలిపిందన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీ నాయకులు ఈ విధంగా చేస్తూ ఏజెన్సీ ప్రాంత పిల్లలను చదువుకు దూరం చేస్తూ వారిచేత అసాంఘిక కార్యాకాలాపాలు చేయించుకుంటూ వారి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఎస్పీ అన్నారు.
Thieves: దొంగల వింత డిమాండ్.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?
ఆదివాసి ప్రజల సొమ్ముతోనే జీవనం సాగిస్తూ వారినే వేధింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనించాలని ఎస్పీ అన్నారు. ప్రజలెవ్వరూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సహకరించకూడదని, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి పిల్లల చదువు కోసం మరియు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం జిల్లా పోలీసులు పని చేస్తున్నారని వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో పనిచేసే నాయకులు, సభ్యులు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలసి మెరుగైన జీవితాన్ని గడపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Maoist