Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
పేద ప్రజలు అనారోగ్యాన బారిన పడితే వాళ్లకి తక్కువ ధరకే మందులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందుల షాపు (Generic Medical Shops) లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రవేట్ వైద్యులందరూ మందులను ప్రిస్క్రిప్షన్లలో రాయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జనరిక్ మందుల షాపులను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) ఏజెన్సీలో మాత్రం ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నిజానికి బ్రాండెడ్ మందుల్లో వాడే ఔషధాన్నే జనరిక్ మందులలో వాడుతారు. కానీ వీటిపై ఔషధ మూలకం పేరు తప్పా బ్రాండెడ్ లాగా ఆకర్షణీయ పేరులు ఉండవు. దీంతోపాటు బ్రాండెడ్ మందులతో పోలిస్తే.. అదే మూలకం ఉన్న జనరిక్ మందులు 40 నుంచి 90 శాతం తక్కువకు ధరకే లభిస్తాయి.
ఉదాహరణకు జ్వరానికి వాడే పారాసిటమాల్ సాధారణ మందులు షాపుల్లో రూ. 10 నుంచి రూ.15 వరకు పడుతుంటే జనరిక్ షాపుల్లో రూ.4.51కే లభిస్తోంది. ఇలా తక్కువ ధరకే లభిస్తుండటమేమో, లేక మరి ఏదైనా కారణం ఏమిటో తెలియదు కానీ వైద్యులు ఎవరు రిసెప్షన్లో ఈ జనరిక్ మందులను రాయడం మరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న మెజారిటీవైద్యశాలల్లో ఈ తీరు కనిపిస్తోంది.
బ్రాండెడ్ కంపెనీలు తమ మందులను ప్రిస్క్రిప్షన్లో రాస్తే నజరానా, విలువైన వస్తువులు అందించడం, విదేశీ పర్యటనలకు తీసుకెళ్లడం వంటి ఆకర్షణీయ పథకాలను అందిస్తున్నాయి. దీంతో కొందరు వైద్యులు వాటికి లొంగి జనరిక్ ను పక్కనబెడుతున్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యలందరికీ దాదాపుగా సొంత మెడికల్ దుకాణాలు ఉండటంతో ఎక్కువ లాభాలనిచ్చే బ్రాండెడ్ మందులనే వ్యాధి బాధితులకు అంటగడుతున్నారు.
తప్పనిసరిగా జనరిక్ మందులు రాయాలనే నిబంధనను వైద్యులు ఉల్లంఘిస్తున్నప్పటికీ.. అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇదిలా ఉండగా గిరిజనులు పేద ప్రజలు ఎక్కువగా నివసించే భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా జనరిక్ దుకాణాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ.. వాటిని నెలకొల్పేందుకు ముందుకు వచ్చేవారు లేరు. భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా ఒక్క భద్రాచలం పట్టణంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ దుకాణం మాత్రమే ఉండడం ఇందుకు నిదర్శనం.
ఈ మందులపై ప్రజల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఆదివాసీల్లో అవగాహన లేకపోవడం, కొద్దోగొప్పో అమ్ముడుపోయే మందుల వల్ల కూడా లాభాలు రాకపోవడంతో దుకాణాలు నెలకోల్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి జనరిక్ ఔషధ స్టోర్లలోనూ కనిపిస్తోంది. వీటిల్లో లాభాల కోసం బ్రాండెడ్ మందులు సైతం అమ్ముతున్నట్లు, అన్ని రకాల జనరిక్ లు అందుబాటులో ఉంచడాన్ని మరిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి వైద్యులు జనరిక్ మందులను ప్రిస్క్రిప్షన్ రాసేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana