(Kranthi Kumar, News 18, Bhadradri)
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతోన్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా ఛార్జీలు, బస, భోజన వసతితోపాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పించనుంది.
దరఖాస్తు విధానం..
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాలలో సాధించిన ప్రగతికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాలను ఏప్రిల్ 20న ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు.
ఎంపిక ఇలా..
ప్రస్తుతం తొమ్మిదో (2022-23) తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వామ్యం, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలంపియాడ్లో పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
మే 15 నుంచి 26 వరకు శిక్షణ..
శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.
ఎంపికైన విద్యార్థుల కోసం ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. 1) ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్, 2) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, తిరువనంతపురం, 3) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట 4) యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్, బెంగళూరు, 5) స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్, 6) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ , 7) నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్ ఇదిలా ఉండగా ఇదే విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారులు న్యూస్ 18తో మాట్లాడుతూ.. డీఎస్వో ఇస్రోలో శిక్షణ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, అంతరిక్ష పరిశోధన రంగాలపై ఆసక్తి పెంచడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికైన విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana