రిపోర్టర్ : క్రాంతి దాసరి
లొకేషన్ : భద్రాచలం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇరువురు ఉద్యోగులకు ఉగాది పురస్కారం వరించింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలలో భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో డోలు విద్వాంసులు మున్నంగి నాగేశ్వరరావు, నాదస్వర విద్వాంసులు లొడుగు కేశన్నలకు హైద్రాబాద్ లోనిరవీంద్రభారతిలో జరిగిన ఉగాది కార్యక్రమంలో పురస్కారాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , కేవీ రమణాచారిలు అందజేసి శాలువాతో సత్కరించారు. దేవస్థాన సిబ్బంది ఉగాది పురస్కారాలను అందుకోవడంతో వారికి భద్రాచల దేవస్థానం ఆలయ ఈవో రమాదేవి శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాకుండా అర్చక, వైదిక సాధారణ పరిపాల విభాగాలకు చెందిన ఉద్యోగులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత లడుగు కేశన్న మాట్లాడుతూ.. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 2010లో నాదస్వర విధ్వంసునిగా విధుల యందు చేరగా 2012 సంవత్సరంలో రెగ్యులరైజ్ అవ్వడం జరిగిందని.. నాటి నుంచి నేటి వరకు స్వామివారి సేవలో భాగస్వామ్యం అవడం తమ పూర్వజన్మ సుకృతమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న దేవస్థానంలో సంగీత విద్వాంసుల పోటీ పరీక్షలలో న్యాయనిర్ణేతగా తొడుగు కేశన్నను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు నియమించడం విశేషం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం వల్లే తనకు ఇలాంటి పురస్కారాలు లభిస్తున్నాయని.. ప్రస్తుతం లభించిన పురస్కారం తనలో నూతన ఉత్సాహాన్ని నింపిందని కేశన్న తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు సాహితీవేతలకు రచయితలకు ఉగాది పురస్కారాన్ని ఇవ్వడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆనవాయితీగా కొనసాగుతున్న అంశం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆనవాయితీని కొనసాగిస్తుండడం విశేషం. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో అత్యంత ఘనంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను అందజేస్తూ వస్తుంది.తెలుగువారు నూతన సంవత్సరంగా భావించే ఉగాది పర్వదినాన ఇటువంటి పురస్కారాలు పలువురికి అందించడంతో పురస్కార గ్రహీతలు తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటువంటి పురస్కారాలను అందుకోవడం వల్ల తమ బాధ్యత మరింత పెరగడమే కాకుండా విధుల యందు అత్యంత నిబద్ధతతో పనిచేసేందుకు ఇటువంటి పురస్కారాలు దోహదపడతాయని పలువురు పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri, Local News