కెరియర్ పేరుతో కొందరు, గాడ్జెట్స్తో కాలక్షేపం చేసే వారు మరికొందరు. నేటి సమాజంలో ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతున్నారు. సమాచార హక్కు చట్టం ఉందని..దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చనే విషయాన్నే మర్చిపోతున్నారు. కాని భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నల్లపు మణిదీప్ (Manideep)అనే ఓ యువకుడు తాను తెలుసుకోవాలనుకున్న విషయాల గురించి (RTI)(Right to Information) సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ వేస్తే అది ఇప్పుడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంతో పాటు అన్నీ రాష్ట్రాల హైకోర్టులను కదిలించింది. మణిదీప్ కోరిన సమాచారం ఏమిటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అంటే సుమారు 73ఏళ్ల కాలంలో నమోదైన కేసులెన్నీ..? అందులో తీర్పు వచ్చినవి ఎన్ని ? రానివి ఎన్ని..? ఇంకా పెండింగ్లో ఉన్న కేసులెన్నీ..?..ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి..? వీటిపై సమాచారం కావాలని కోరాడు. మణిదీప్ చేసుకున్న ఒకే ఒక్క ఆర్టీఐ దరఖాస్తు సుప్రీం కోర్టే కాదు దేశంలోని అన్నీ హైకోర్టులతో పాటు జిల్లా కోర్టులు, సీబీసీఐడీ న్యాయస్థానాలు, ట్రైబ్యునల్స్ ఇలా అన్ని కోర్టుల్నీ అతను అడిగిన సమాచారం కదిలేలా చేసింది.
73ఏళ్ల సమాచారం కోసం..
ప్రస్తుత సమాజంలో యువతలో చాలా మంది ఏదో కొత్తగా కనిపెట్టాలనుకునే వాళ్లు ఉన్నారు. సోషల్ మీడియాను వాడుకొని తమ ఉనికిని చాటుకునే వాళ్లు ఉన్నారు. ఉపాధి, ఉద్యోగం, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు తప్ప హక్కులపై అవగాహన కల్పించుకోవడం లేదు. కాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నల్లపు మణదీప్ అనే 23సంవత్సరాల యువకుడు తొలిసారిగా అలాంటి ప్రయత్నం చేశాడు. మణిదీప్ ఆర్టీఐ ద్వారా వేసిన ఒక్క దరఖాస్తు ..సుప్రీం కోర్టు మొదల్కొని..అన్నీ న్యాయస్థానాలను కదిలించింది. పినపాక మండలం ఏడళ్ల బయ్యారం క్రాస్రోడ్డుకు చెందిన స్టూడెంట్ నల్లపు మణిదీప్ .. తనకు సమాచార హక్కు చట్టం ద్వారా తనకు భారత దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించి తీర్పు వెల్లడించినవి, ఇంకా తీర్పు రానివి, పెండింగ్లో ఉన్న కేసులు, ఎన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి..అందుకు గల కారణాలపై సమాచారం ఇవ్వాలని సెక్షన్ 4(1(C)(D)కోరాడు.
ఒకే ఒక ఆర్టీఐ దరఖాస్తు..
గత నెలలో మణిదీప్ వేసిన ఆ ఒక్క పిటిషన్పై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ స్పందించింది. మణిదీప్ కోరిన వివరాలు, సమాచారం అందజేసేందుకు సముఖుత వ్యక్తం చేస్తూ అతని దరఖాస్తును సుప్రీం కోర్టుతో పాటు అన్నీ హైకోర్టులకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ఆర్టీఐ దరఖాస్తుపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు అవసరమైతే ఇతర శాఖలకు పంపించి ఇవ్వవలసినదిగా కోరింది.
చట్టంపై నమ్మకం ఉంది..
తాను వేసిన పిటిషన్ సుప్రీం కోర్టుకు వెళ్లడం పట్ల మణిదీప్ హర్షం వ్యక్తం చేశాడు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఏర్పడిందని తెలిపాడు. న్యాయస్థానాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ప్రజలందరికి వివరంగా తెలియజేస్తానని చెప్పడం జరిగింది. తన లక్ష్యం కోసం చదువుకుంటూనే మణిదీప్ ఆ చదువును ప్రాక్టీసులో పెడుతున్నాడు. ఇప్పటి నుంచే తన చుట్టూ ఉన్న ప్రజలకు ప్రభుత్వంతో ఉన్న అవసరాలకు తానో వారధిగా నిలబడ్డాడు. తెలంగాణలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ యువకుడు చేసుకున్న ఒక్క దరఖాస్తు దేశంలోని అన్నీ న్యాయస్థానాల్ని కదిలించేలా చేయడంపై మేధావులు సైతం అభినందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.