(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అటవీ ప్రాంతాలు కోడిపుంజుల నెత్తుటితో తడిసి పోతున్నాయి. రక్తపు మడుగులో కోళ్లు గిలాగిలా కొట్టుకుని ప్రాణాలు విడుస్తుంటే కొందరు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు భద్రాచలం ఏజెన్సీ అటవీ ప్రాంతం ప్రతీ ఏటా వేదికగా మారుతోంది. భద్రాచలం మండలంతో పాటు దుమ్ము గూడెం మండలం అడవుల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
పందాల నిర్వహణకు ఐదుకి పైగా వేదికలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ నిర్వహించే కోడి పందాలు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున జూద గాళ్లు వస్తుంటారు. ఇప్పటికే అడపాదడపా సాగుతున్న కోడి పందాలు నేటి నుండి ఈ నెలాఖరు వరకు పెద్ద ఎత్తున సాగనున్నట్లు తెలుస్తోంది. కోడి పందాల పేరుతో మూగ జీవాలతో జూదరులు చెలగాటం ఆడుతున్నారు. ఇదిలా ఉండగా కోడి పందాలు నిర్వహించే చోట సర్వం అందుబాటులో ఉండనున్నాయి.
ఇతర ప్రాంతాల నుండి వచ్చే కోడిపందాలలో పాల్గొనే వారితో పాటు చూసేందుకు వచ్చే వారి కోసం వేదికల వద్ద సర్వం సిద్ధంగా ఉంచుతున్నారు. మద్యం, బిర్యాని, మాంసం, సిగరెట్స్, గుట్కాలు కూడా రెడీగా ఉంటున్నాయి. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పై అదనంగా రూ.20 నుండి 40 వరకు వసూళ్లు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడే గుమగుమలాడే బిర్యానీ కూడా సిద్ధం చేస్తారట. మరో ప్రక్క కారు పార్కింగ్, మోటారు సైకిల్ పార్కింగ్ లకు కూడా రసుము వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కోడి పందాల పేరుతో కోట్లాది రూపాయల రక్తపు మరకల వ్యాపారం సాగనుంది.
ఒక్కొక్క బరిలో ఒక రోజుకి సుమారు రూ.5 లక్షల నుండి రూ.6 లక్షల వరకు జరిగే అవకాశం ఉంది. సుమారు ఐదు కేంద్రాలలో కలిపి రోజుకు సుమారు 30 లక్షలకు పైగా జూదం సాగనుంది. ఇదిలా ఉండగా పై పందాల పేరుతో మరో రూ.10 లక్షల వరకు సాగే అవకాశముంది. సుమారుగా రోజుకు రూ.40 లక్షల జూదం సాగనుండటంతో మొత్తం మీద పందాల నిర్వహణ అయ్యే సమయానికి ఇది రూ.50కోట్లకు పైగా కోడి పందాల నిర్వహణ సాగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం చట్ట విరుద్దమని కోర్టులు మొత్తుకుంటున్నప్పటికీ అడ్డూ అదుపు లేకుండా జూదం సాగిపోతుంది.
వీటిని నివారించాల్సిన అధికారులు ఊదాసీనంగా వ్యవహరించడంతో జూదగాళ్లు ఆడిందే ఆటా పాడిందే పాటగా సాగుతోంది. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలంతో ముట్ట చెబుతున్నామని, ఇక మమ్మల్ని ఆదేపి ఎవరంటూ జాదగాళ్లు బహిరంగంగానే అంటున్నట్లు తెలుస్తోంది. ఈ జూదాలు తెలంగాణ , ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో అత్యధికంగా జరిగే అవకాశం ఉందని, ఛత్తీస్ ఘడ్ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అధికారులను మేనేజ్ చేశామని, స్థానిక అధికారులకు కూడా ముడుపులు ముట్ట చెబుతున్నామని ధీమాను జూదపు నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంక్రాతి పేరు చెప్పుకుని రక్తపుటేరుల్లో కోట్ల వ్యాపారానికి పడగలిప్పిన వారికై కఠిన చర్యలు తీసుకోవాలని మూగజీవాల ప్రేమికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana