హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన మరువక ముందే తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపాలెంకు చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్ (5) గ్రామంలో పిల్లలతో ఆడుతుండగా వీధిలో ఉన్న కుక్కలు దాడి చేశాయి.
దాడి చేసిన అనంతరం స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితిని గమనించిన డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని... వెంటనే హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బాబును తీసుకొని వెంటనే ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు వెళుతుండగా మార్గం మధ్యలోనే బాలుడు మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
వీధిలో తిరుగుతున్న కుక్కలను చూసి గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న కుక్కలను నియంత్రించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Local News, Stray dogs