Kranthi Kumar, News 18, Bhadradri
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు 232వ జయంతి ఉత్సవాలను దేవస్థాన అధికారులు అత్యంత ఘనంగా నిర్వహించారు. మొదట ప్రధాన ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రాజా తూము లక్ష్మీనరసింహదాసు చిత్రపటంతో దేవస్థానం పురవీధుల్లో నగర సంకీర్తనను నిర్వహించారు. వేద పఠనం, భక్తి కీర్తనలులతో భద్రగిరి గిరిప్రదక్షిణను నిర్వహించారు.
విస్తా కాంప్లెక్స్ ఆవరణలోని రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు విగ్రహం వద్ద ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించి హారతి, తీర్థప్రసాదాలు అందించారు. హరిదాసులు చేసిన నగర సంకీర్తన పలువురిని ఆకట్టుకుంది.భద్రాద్రి రామయ్యకు సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు దశవిధ ఉత్సవాల రూపకర్త. అందుకు అనుగుణంగా కీర్తనలను రచించి వాటిని గానానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు భక్తరామదాసు.
ఆ తరువాత రామయ్యను అత్యంత భక్తితో కొలిచిన అపర భక్తరామదాసు రాజా తూము లక్ష్మీ నరసింహదాసు. భద్రాద్రి రాముని సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి రామ భక్తిలో తరిస్తూ తీర యాత్రలను చేస్తూ భద్రాచలంకు వచ్చి తన స్నేహితుడైన వరద రామదాసు సాయంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు. అంతటి మహనీయునికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు విస్మరిస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినినిస్తున్నాయి.
ఏటా రాజా తూములక్ష్మీనరసింహదాసు జయంతి పేరిట ఒక రోజు దాసునికి దండం మాదిరిగా మొక్కుబడి కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆయన ఊసే మరిచిపోతున్నారని భక్తులు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం మాడ వీధుల అభివృద్ధి పేరుతో శతాబ్దాల కాలంగా ఉన్న తూము నరసింహదాసు ఇంటిని తొలగించారు. ఆలయ ప్రాంగణంలో భక్తరామదాసు విగ్రహం ఏర్పాటుచేయగా, తూము నరసింహదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందనే అభిప్రాయం రామ భక్తుల్లో ఉంది.
కాని ఆ దిశగా దేవస్థానం అధికారులు కసరత్తు చేయరు సరికదా కనీసం ఆలోచించటం లేదని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇలా జయంతి ఉత్సవాలు సందర్భంలో మాత్రమే ఆమహనీయుడిని గుర్తు చేసుకుంటారని పలువురు ఆరోపిస్తున్నారు.
దర్బారు సేవకు శ్రీకార కర్త
దశవిధ ఉత్సవాల్లో అత్యంత కీలకమైంది. దర్బారు సేవ. మరో రామదాసుగా ప్రసిద్ధిగాంచిన రాజా తూము లక్ష్మీ నర్సింహదాసు ఇచ్చిన స్పూర్తితోనే 1998లో భద్రాద్రి రామయ్యకు 108 బంగారు పుష్పాలను చినజీయర్ స్వామీ రామయ్య సేవకు సమర్పించారు. కాగా తూము నర్సింహదాసు చెక్కించిన శిలాశాసనసాలు, రామస్తంభం నేటికి భద్రాద్రి ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana