భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారికి విశేష పూజలు జరుగుతున్నాయి. దేవస్థానం స్థానాచార్యులు కేయి స్థల సాయి పర్యవేక్షణలో యజ్ఞయాగాలు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ బ్రహ్మోత్సవాలలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాలు, మఠాల నుంచి 108 మంది అర్చక స్వాములను నియమించడం జరిగింది.
ఇదిలా ఉండగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో శ్రీరామాయణ క్రతువు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం స్వామివారి ఉత్సవ మూర్తులను మేళ తాళాలు, రుత్విక్ మంత్రోచ్ఛరణల నడుమ యాగశాలలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. 12 హోమ కుండాలలో శ్రీరామాయణ క్రతువు నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్విక్లు చతుర్వేద హవనాలు, రామాయణ హవనం చేయగా, మరో వైపున రామషడాక్షరీ, నారాయణ అష్టాక్షరి మంత్రాలను జపించారు. అనంతరం సంక్షేప రామాయణ సామూహిక పారాయణం చేపట్టారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు.
ఇదిలా ఉండగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈసారి నిర్వహిస్తున్న వసంతపక్ష పుష్కరోత్సవాలకు మార్చి 22నశ్రీకారం చుట్టారు. అయితే 2011లో నిర్వహించిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమానికి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉత్సవాల తీరులోని వ్యత్యాసాలపై వైదిక పరిపాలన వర్గాల్లో అంతర్గత చర్చ సాగుతోంది.
దేవస్థానం అధికారికంగా విడుదల చేసిన ఆహ్వాన పత్రికలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి అంకురారోపణం 26వ తేదీ సాయంత్రం ఉంటుందని పేర్కొన్నారు. అయితే 22వ తేదీనే శ్రీరామాయణ మహాక్రతువు అంకురార్పణతో పాటే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మృత్సంగ్రణాన్ని ఒకేసారి నిర్వహిస్తున్నట్లు వైదిక సిబ్బందే పేర్కొంటున్నారు. 2011 ఏప్రిల్ 4న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి అంకురార్పణ, స్వామివారి కల్యాణానికి ఏప్రిల్ 8న అంకురార్పణ చేశారు.
ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయంలో దర్బారుసేవ నిర్వహిస్తారని దేవస్థానం అధికారికంగా ప్రచురించిన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. కానీ ఆ కార్యక్రమం నిర్వహించలేదు. వసంత పక్ష పుష్కరోత్సవాల నేపథ్యంలో దర్బారు సేవ, పవళింపు సేవలు నిలిపివేసినట్లు వైదిక పరిపాలన సిబ్బంది పేర్కొంటున్నారు.
వాస్తవానికి దేవస్థానం ఈవోకు వైదిక కమిటీ అందజేసిన లేఖ ప్రకారం ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5వరకు మాత్రమే దర్బారు సేవలు నిలిపివేస్తున్నామని, అలాగే 26 నుంచి 11వరకు పవళింపు సేవలు ఉండవని పేర్కొనడం గమనార్హం. కాగా బుధవారం పట్టాభిషేకం, కల్యాణోత్సవాల కోసం వేర్వేరుగా కంకణాలను ఆచా బ్రహ్మలు, రుత్వికులు కట్టుకోగా మూలవరులకు సైతం కంకణాలను కట్టినట్లు పలువురు వైదిక సిబ్బంది పేర్కొంటున్నారు.
అయితే ఈ కంకణధారణలో సైతం వైదిక వర్గాల్లో భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంతప్రతిష్టాత్మకంగా వసంతపక్ష పుష్కరోత్సవాలను నిర్వహిస్తుండగా ప్రారంభ కార్యక్రమంలో కీలక వైదిక సిబ్బంది లేకపోవడం లోటుగా ఉందనే వ్యాఖ్యలు దేవస్థానం వైదిక పరిపాలన సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana