Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో ఈ ఏడాది మార్చిలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు సైతం టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించగా ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన శ్రీరామనవమి (సీతారాముల కళ్యాణం) మార్చి 30న, 31న పుష్కర పట్టాభిషేకం నిర్వహించేందుకు ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వైదిక బృందం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే కార్యక్రమాలు సైతం ప్రారంభించారు ఆలయ అధికారులు.
ఇదిలా ఉండగా అత్యంత ఘనంగా జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీరామనవమిని భక్తులు వీక్షించేందుకుగాను కల్యాణ టికెట్లను నేటి నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచనున్నారు అధికారులు. భద్రాద్రి, సీతారామచంద్ర స్వామి వారి అధికారిక వెబ్ సై ట్ www.bhadrachalamonline.com సందర్శించి భక్తులు తమకు కావలసిన టిక్కెట్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉండగా భద్రాచలం రామాలయం ఆధ్వర్యంలో మార్చి 30న శ్రీరామ నవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తుండగా భక్తుల దర్శనభాగ్యంపై కోత విధించారు. దేవాలయానికి సమీపంలో ఉన్న మిథిలా మండపంలో ఈ ఉత్సవం సాగనుంది. ఇందులో సదుపాయాల కల్పన పేరిట గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సంఖ్యను కుదిస్తున్నారు.
ఇప్పటికే మిధున స్టేడియం ఆవరణలో కళ్యాణం వీక్షించే ప్రాంతాన్ని 9 సెక్టార్లుగా విభజించిన అధికారులు టికెట్ ధర సెక్టార్ల వారీగా నిర్ణయించారు. రూ.150 నుంచి రూ. రూ.7500 వరకు ధరలను నిర్ణయించగా గతంలో అన్ని సెక్టార్లలో కలిపి 20,005 మందికి అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం భద్రాద్రి దేవస్థానం అధికారుల తాజా ప్రణాళికల ప్రకారం 16,860 మందికే టిక్కెట్ల ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. దీని ప్రకారం 3,145 మంది భక్తులకు దర్శన భాగ్యం ఉండదు. పుష్కరోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికి ఇది ఇబ్బందికరమే. స్టేడియంపై 15 వేల మందికి ఉచిత ప్రవేశం యథాతథంగా ఉంచారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే టికెట్ల పరిమితి సంఖ్యను కుదించినట్లు భద్రాద్రి దేవస్థానం అధికారులు న్యూస్ 18కు వివరించారు. ఏది ఏమైనప్పటికీ గత రెండు నెలలుగా కోవిడ్ కారణంచే ఆలయ ప్రాంగణంలోనే అంతరంగికంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం ఈ ఏడాది మాత్రం మిధున స్టేడియంలో పూర్వం మాదిరిగా నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా కుదించిన టికెట్ల విషయంలో రామభక్తులు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana