Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తున్న ఇద్దరు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం (Bhadrachalam) ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) చర్ల మండల కేంద్రానికి సమీపంలోని లక్ష్మీ కాలనీ గ్రామంలో గురువారం ఉదయం చర్ల పోలీసులు, సిఆర్పిఎఫ్ 141 సిబ్బంది కలిసి చేసిన వాహన తనిఖీలో చర్లకు చెందిన పల్లపు సమ్మయ్య, పల్లపు సత్యవేణి లను అరెస్టు చేసినట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు గత రెండు సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ దళానికి కొరియర్లుగా పనిచేస్తూ, వారికి అవసరమయ్యే నిత్యావసర సరుకులను, పేలుడు పదార్థాలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
వీరిద్దరూ రాంపురం, కొండపల్లి, భీమారం సంతలలో కూరగాయల వ్యాపారం చేస్తూ, నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులతో పరిచయాలు పెంచుకొని, మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తూ, సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మావోయిస్టు పార్టీ నాయకుల ఆదేశం ప్రకారం వీరి ఇరువురు మరి కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలతో మందు పాతర్లను తయారు చేయడానికి అవసరమయ్యే ప్రెషర్ కుక్కర్లు, విధ్వంసకర పేలుడు పదార్థాలను తయారు చేయడానికి అవసరమయ్యే రసాయనక పదార్థాలను చేరవేస్తున్న క్రమంలో గురువారం పట్టుబడినట్లు ఆయన తెలిపారు.
వీరి వద్దనుండి 200 మీటర్ల కార్డెక్స్, వైర్ బండిల్, 12 లీటర్ల సామర్థం గల ప్రెషర్ కుక్కర్లు, వాటిని తరలించడానికి ఉపయోగిస్తున్న ట్రాక్టర్, ట్రాలీలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆ ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ కాబడిన నిందితులిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ డర్, చర్ల సిఐ బి అశోక్, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, చర్ల ఎస్సై వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Maoists, Telangana