Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యుల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య (Bhadrachalam MLA podem Veeraiah) కు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం 33 మంది సభ్యుల పేర్లతో జాబితా విడుదల చేయగా అందులో పొదెం వీరయ్య పేరు కూడా ఉండడం విశేషం. ఇప్పటికే ఆయన రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా మంగపేట మండలం తొండ్వాల్ లక్ష్మీపూర్ గ్రామంలో జన్మించిన పొదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట ఎంపీటీసీగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. 1999, 2004లో ములుగు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయిన వీరయ్య.. 2018 ఎన్నికల్లో అనూహ్య పరిణామాల నడుమ భద్రాచలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నాటి నుంచి అధికార పార్టీ నుంచి ఫిరాయింపులు ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ నిజాయితీ, నిబద్ధత చాటుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పోదెం వీరయ్య గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు, రాష్ట్ర విభజనలో ఏకాకిగా మిగిలిన భద్రా చలం, విలీన పంచాయతీలు, భద్రాచలం అభివృద్ధికి సీఎం ప్రకటించిన రూ.100 కోట్ల నిధుల విడుదల తదితర సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. జిల్లాలో పార్టీ కార్యకర్తలను ఏకతాటిపై నడిపించడంలో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉండడంతో పలు పదవులు ఆయనను స్వచ్ఛందంగా వరించాయి.
జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అన తికాలంలోనే జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను కేంద్ర నాయకత్వం అప్పగించడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏఐసీసీ సభ్యుడిగా ఎన్నికైన పొదెం వీరయ్యకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఇటీవల భద్రాచలం గ్రామపంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ అసెంబ్లీలో తన గళాన్ని గట్టిగా వినిపించారు.
అంతేకాకుండాప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, శాసనసభలో అనైతికంగా ప్రవేశపెట్టి ఆమోదించిన తీర్మానాన్ని చట్టం చేయవద్దంటూ గవర్నర్ తమిళ సైని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం ఆయన హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Local News, Telangana, TS Congress