Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రం పులకించింది. కల్యాణ మహోత్సవానికి ముందే రామయ్య మరింత సుందరంగా భక్తులకు దర్శనమిచ్చి మురిపించాడు. భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాచలం మరింత సుందరంగా సాక్షాత్కరించింది. మార్చి 30వ తేదీన మిధులా స్టేడియం ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సీతారాముల కళ్యాణం (Sri Rama Navami) మహోత్సవం. ఈ కళ్యాణ క్రతువులు స్వామివారికి అమ్మవారికి ఉపయోగించే కల్యాణ తలంబ్రాలను కలిపే పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఆరంభించడంతో మార్చి 7వ తేదీన భద్రాద్రి దివ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
ఈ తలంబ్రాల అవసరాల నిమిత్తం తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. ఈ క్రమంలో భద్రాచల పట్టణంలోని పురవీధులన్నీ గోటి తలంబ్రాలు తెచ్చినవారితో అంతటా సందడి నెలకొంది. భక్తమండళ్ల కోలాటాలు మంత్రముగ్ధులను చేశాయి. పసుపు కొమ్ములను దంచడంతో మొదలైన క్రతువులోని ప్రతీ ఘట్టం పరమానందాన్ని పంచింది. ఇదిలా ఉండగా చిత్రకూట మండపంలో ఏటా తలంబ్రాలు కలుపుతుంటారు.
కానీ ఈ ఏడాది చిత్రకూట మండపంలో స్వర్ణ ద్వాదశ వాహనాలను ఉంచడంతో తలంబ్రాలు కలిపి కార్యక్రమం వేదికను ఉత్తర ద్వారం వద్దకు మార్పు చేశారు దేవస్థానం అధికారులు. ఈ క్రమంలో ముందుగా ప్రధాన ఆలయం నుంచి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలు వేదమంత్రోత్సవాల నడుమ మిథిలా స్టేడియానికి ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామి వారిని తీసుకువచ్చి బంగారు సింహాసనం పై ఆసీనులు చేశారు.
అనంతరం రామార్చన తదితర పూజా కార్యక్రమాలు పూర్తిచేసి తలంబ్రాల విశిష్టతను భక్తులకు వివరించారు. రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి అర్చక స్వాములు అనంతరం పసుపు కొమ్ములను దంచి పసుపుగా తయారుచేసి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన అర్చక స్వాముల సతీమణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా అనంతరం మిధున స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మహిళా ముత్తైదువులు తలంబ్రాలు కలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో వేద పండితుల సతీమణులు, శ్రీవైష్ణవ ముత్తయిదువలు తొలుత పసుపు కొమ్ములను దంచి పెళ్లి పనులు ప్రారంభించారు. అనంతరం బియ్యంలో పసుపు, రోజ్వాటర్, గులామ్, సుగంధద్రవ్యాలు, అత్తరు పోసి తలంబ్రాలు కలిపారు. మొదట తయారుచేసిన తలంబ్రాలను ఆలయ అధికారులు తలపై ధరించి స్వామివారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana