(Lenin, Nes18, Adilabad)
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి (Basara IIIT) కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వేల సంఖ్యలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళాశాల మెస్ ల లో భోజనం (Food) సరిగా ఉండటం లేదని, విద్యుత్ సమస్య (Power Issue), నీటి సమస్య (water Issue) తీవ్రంగా వెంటాడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వకుండా చదువు పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ బాసర త్రిబుల్ ఐటీ లోపల సుమారు ఆరు గంటలకు పైగా ఆందోళన (Protest) చేపట్టారు. రెగ్యులర్ వైస్ చాన్సలర్ ను నియమించడంతోపాటు పర్మినెంటు ఉద్యోగులను కూడా నియమించాలని, తాగునీటి సమస్యతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని, ల్యాప్ టాప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా,గతంలోనూ విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
గత రెండు సంవత్సరాల నుండి బాసర త్రిబుల్ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బీఎస్పి (BSP) పార్టీ నాయకులు కళాశాలకు చేరుకున్నారు. వారిని కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు కూడా విద్యార్థులకు మద్దతుగా ట్రిబుల్ ఐటి కళాశాల ప్రధాన ద్వారం వద్ద తమ నిరసన తెలిపారు. ప్రతి రోజు సమస్యలు వేధిస్తున్నా, విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. బిఎస్పి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కళాశాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఇదిలా ఉంటే గతంలోను ట్రిపుల్ ఐటి విద్యార్థులు (IIIT Students) పలుమార్లు ఆందోళనలు చేపట్టినా అధికారులు బయటకు పొక్కకుండా చూస్తున్నారు. గతంలో విద్యార్థులకు పెట్టే భోజనం లో బొద్దింకలు, బల్లులు, కప్పలు కూడ రావడంతో ఆందోళన చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో పరిపాలన గాడి తప్పిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బాసర ట్రిబుల్ ఐటిపై దృష్టి సారించి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇక్కడి పరిపాలనను గాడిలో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో సంస్థ ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు సంఘీభావం..
మరోవైపు పలు సంఘాలు, పార్టీలు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాయి. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని స్వెరోస్ స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి సోన్ కాంబ్లే వికాస్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను యాజమాన్యం కేసులు పెడతామని బెదిరింపులకు దిగడం సిగ్గుచేటని అయన అన్నారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విశ్వ విద్యాలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, న్యాక్ లో సి గ్రేడ్ రావడం శోచనీయమని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Basara IIIT, Students