రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంతో తెలంగాణ బిజేపి వైఖరిని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాసింది.దీంతోపాటు ఇరు ప్రభుత్వాలపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీఎంలు తమ రాజకీయ అవసరాల కోసమే వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలని లేదని అన్నారు. కేసీఆర్ – జగన్ ఇద్దరు కుమ్మక్కై రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆరే అవకాశం ఇచ్చి తెలంగాణ కు ద్రోహం చేసారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే 2 వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేయించారని అన్నారు.
కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్ -1 ప్రకారం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించారని. 2010 లో ఏర్పాటైన బ్రిజెష్ కుమార్ ట్రిబ్యూనల్ కృష్ణా జలాల కేటాయింపులు ఖరారు చేసింది. కాని తీర్పు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండటంతో బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారమే అంటే 811 టీఎంసీం వినియోగించుకోవడం జరుగుతోందని లేఖలో వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ విభన తర్వాత 2014 లో 811 టీఎంసీల కృష్ణా జలాల్ని తెలంగాణ , ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు తాత్కాలిక ప్రాతిపాదికన వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి తీరని నష్టం చేశారని సంజయ్ పేర్కోన్నారు. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రం కేవలం 299 టీఎంసీలు మాత్రమే వాడుకుని, ఆంధ్ర ప్రదేశ్ కు 512 టీఎంసీలు వాడుకునేందుకు కేసీఆర్ అంగీకరించి ఘోరతప్పిదం చేసి తెలంగాణ నోట్లో మట్టికొట్టారని అన్నారు.
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టును నిర్మించాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. కాని అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ చేపట్టిన ఈ ప్రాజెక్టుల్ని ఆపడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారు. దీంతో తెలంగాణ హక్కుల్ని కాపాడటంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దారుణంగా వైఫల్యం చేందారని అన్నారు.
ఈ వివాదంపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ గత సంవత్సరం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను ఏర్పాటు చేస్తే ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మీటింగ్ ను వాయిదా వేయించి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కొనసాగేందుకు అవకాశం కల్పించారని పేర్కోన్నారు. ప్రస్తుతం శ్రీశైలం లోని సంగమేశ్వరం దగ్గ రాయలసీమ ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతూ 50 శాతం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. దీంతో కృష్ణా జలాల్లో తెలంగాణ దారుణంగా నష్టపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ను ఆపేందుకు కేంద్రమే చొరవ తీసుకుందని, కాని కేసీఆర్ పట్టించుకోలేదని పేర్కోన్నారు. జగన్ తో కుమ్మక్కై కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కేసీఆర్ కాపాడలేకపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరలో KRMB పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతున్నానంటూ లేఖలో తెలిపారు. తద్వార కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కాపాడటం సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ట్రిబ్యూనల్ తీర్పు వచ్చాక దాని ప్రకారం రాష్ట్రానికి వచ్చే కృష్ణా నీటి కేటాయింపులు పూర్తిగా తెలంగాణకే చెందేలా KRMB కాపాడటం సాధ్యం అవుతుందని వివరించారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Water dispute