ముందస్తు ఎన్నికల ఊహాగానాల నడుమ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) సోమవారం నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రభుత్వం తరఫున 2022-23 వార్షిక బడ్జెట్ (Telangana Budget 2022) ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. మరోవైపు ఇదే సమయానికి శాసన మండలి సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. అక్కడ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రతిపాదిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన ఎనిమిదేళ్ల చరిత్రలో.. సభ ప్రారంభమైన తొలిరోజే రోజే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అందునా, గవర్నర్ ప్రసంగం లేకుండా సాగనున్న తొలి బడ్జెట్ సమావేశాలు కూడా ఇవే..
గవర్నర్ ప్రసంగం లేకుండానే..
గత సమావేశాలు ప్రొరోగ్ కాలేదని, ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు వాటికి కొనసాగింపు మాత్రమే అనే కారణంతో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. దీనిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తంచేయడం, బదులుగా ప్రభుత్వ వర్గాలు కౌంటర్ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సోమవారం నుంచి మొదలయ్యే సభలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించటానికి అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. నేడు సభలో బడ్జెట్ పెట్టడానికి వీలుగా దానికి రాష్ట్ర కేబినెట్ ఆదివారం సాయంత్రమే ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.
బాహుబలి బడ్జెట్..
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి బడ్జెట్లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఉద్యోగాల ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, టీచర్ పోస్టులకు సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీలకు భారీగా కేటాయింపుల అవసరం ఉంది. మరోవైపు వైద్యం, ఆరోగ్యం, నీటిపారుదల రంగాలకు గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు కావాలంటూ ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. గతేడాది రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఈసారి పెరిగిన అంచనాలతో రూ.2.7 లక్షల కోట్ల మేరకు పద్దు ఉండొచ్చని భావిస్తున్నారు.
సభ ఎన్నిరోజులంటే..
మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీలో, సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ అధ్యక్షతన మండలిలో బీఏసీ సమావేశం వేర్వేరుగా నిర్వహించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ జరగాలి? అన్నదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకొంటారు. మంత్రి హరీశ్రావుకు ఇది మూడో బడ్జెట్. ఈసారి మండలికి కొత్తగా ఎన్నికైన 19 మంది సభ్యులు హాజరవుతారు. వీరిలో 10 మంది తొలిసారి మండలిలో కాలుమోపుతున్నారు. మండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ తొలిసారి సభను నిర్వహించనున్నారు.
అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశఆరు. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ పరిసరాల్లో కిలోమీటర్ పరిధిలో ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్, ఎస్బీ, ఇంటెలిజెన్స్, రిజర్వ్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, తదితర విభాగాల వారితోపాటు జిల్లాలకు చెందిన పోలీసులు కూడా బందోబస్తు విధుల్లో పాలుపంచుకుంటున్నారు. వీఐపీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాగా, తెలంగాణలో కరోనా లేదని ప్రకటించిన సర్కారు అసెంబ్లీ సమావేశాల్లో మీడియాపై మాత్రం కొవిడ్ ఆంక్షలను కొనసాగిస్తున్నది. అసెంబ్లీ, మండలిలో గ్యాలరీ కవరేజీ కోసం మీడియాకు ఇచ్చే పాసుల సంఖ్యను తగ్గించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.