Arsenic Chemical element: కొన్ని క్రైమ్ సినిమాల్లో వ్యక్తులను ఈజీగా చంపేందుకు ఆర్సెనిక్ పదార్థాన్ని వాడినట్లు చూపిస్తారు. ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన ఖనిజం. ఇట్టే ప్రాణాలు తియ్యగలదు. చూడ్డానికి అందంగా... మెరుస్తూ బూడిద రంగులో ఉంటుంది. ఇది చాలా చోట్ల కొద్ది మొత్తంలో ఉండటం సహజం. దురదృష్టం కొద్దీ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తాగే నీటిలో ఆర్సెనిక్... సహజంగా ఉండేదాని కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సడెన్గా ఇది ఎందుకు ఎక్కువ అవుతోందంటే... భూగర్భ జలాలు పడిపోవడమేనని తేలింది. తాగు నీటి కోసం ప్రజలు భూమిని ఇంకా ఇంకా లోతుగా తవ్వేస్తున్నారు. అలా లోతు ఎక్కువయ్యే కొద్దీ... తాగు నీటిలో రసాయనాలు, ప్రమాదకర ఖనిజ మూలకాలు ఎక్కువవుతాయి. ఎక్కడైతే భూగర్భ జలాల కోసం బాగా తవ్వేస్తున్నారో అక్కడి నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటోందని తేలింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం.. లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఆర్సెనిక్ ఉండొచ్చు. అప్పుడు మనకు ఏమీ కాదు. అది కాస్త ఎక్కువైనా చాలు ప్రాణాలకే ప్రమాదం.
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల, గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల.. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట... భూగర్భ నీటిలో BIS చెప్పిన దాని కంటే ఎక్కువగా ఆర్సెనిక్ ఉదని కేంద్ర జలసంఘం (CWC) తేల్చింది. ఇప్పుడు ఎవరైనా ఆ నీటిని తాగినా... లేదంటే... ఆ నీటితో పండించిన పంటల దిగుబడిని తిన్నా ప్రమాదమే. మనుషుల, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ పాడైపోతుంది. బోన్మ్యారో (ఎముక మజ్జ), చర్మ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 1980లో బెంగాల్లోని భగీరథి నదీ తీరంలో CWC జరిపిన పరిశోధనలో ఆర్సెనిక్ మొదటిసారి బయటపడింది.
దేశవ్యాప్తంగా CWC... తాగునీటిపై పరిశోధనలు చేస్తోంది. కొత్తగా 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రభావం ఉంది. లీటర్ నీటిలో 0.01 నుంచి 0.05 మిల్లీగ్రాముల ఆర్సెనిక్ ఉందని CWC తెలిపింది. బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లో ఇది ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీటిని తీసుకున్న CWC.. వాటిలో ఆర్సెనిక్ ఎంత ఉందో చూసింది. గుంటూరు రూరల్ మండలం ఎటుకూరులో బోరు బావుల నుంచి తీసిన నీటిలో ఒక లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాములు ఉందని తేలింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరాటంపాడులో 0.03 ఉంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రత్న గ్రామంలో 0.02 మీల్లీ గ్రాములు ఉంది. చేబ్రోలు మండలం వడ్డమూడిలో 0.02 మిల్లీ గ్రాములున్నట్లు తేలింది.
తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లో CWC చెక్ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివ్వేముల మండలం కుడాకుడా, సూర్యాపేటలలో సేకరించిన బోరు బావుల నీటిలో లీటర్లో 0.01, 0.02 మిల్లీగ్రాముల ఆర్సెనిక్ ఉన్నట్లు గుర్తించింది. ఆర్సెనిక్ ఉన్న నీటిని తాగొద్దనీ, పంటల కోసం వాడొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు CWC చెప్పింది. ఆ ప్రాంతాల్లో పంటల సాగు కోసం నదీ జలాల్ని ఇవ్వాలని చెప్పింది.
ఇది కూడా చదవండి: Tea benefits: ఎముకలను దృఢంగా మార్చే టీ... రోజూ ఇలా తాగండి
ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
భూగర్భ జలాలను పెంచాలి. వర్షపు నీరు సముద్రాల్లోకి వెళ్లకుండా... భూమిలోకి ఇంకిపోయేలా చెయ్యాలి. ఇందుకోసం చెరువుల్లో పూడికలు తియ్యాలి. నదుల్లో నీటిని ఎక్కువగా వాడుతూ... భూగర్భ జలాల వాడకం తగ్గిస్తే... ఆటోమేటిక్గా తాగునీటిలో ఆర్సెనిక్ మూలాలు తగ్గుతాయి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు అలక్ష్యం చేస్తే... మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని CWC హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, AP News, Telangana News