టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన దరిమిలా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి చర్చలు జోరందుకున్నాయి. కేసీఆర్ కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన మంత్రి కేటీఆర్ ను సీఎం చేయాలని సహచర మంత్రులు, పదులకొద్దీ ఎమ్మెల్యేలు చాలా కాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. బహిరంగ వేదికలు, మీడియా సమావేశాల్లో కేటీఆర్ ను సీఎం అని సంబోధిస్తూ గులాబీ నేతలు గతేడాదంతా సందడి చేశారు.
అయితే, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ దెబ్బలు తగిలాక సదరు డిమాండ్ చల్లబడింది. కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత అధికార పార్టీనేతలెవరూ సీఎం మార్పుపై నోరెత్తలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టనుండటంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు కొడుకు కేటీఆర్ కు ఇస్తారనే చర్చ మళ్లీ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలోనే కేటీఆర్ సీఎం కావాలంటూ ఆంధ్రాకు చెందిన యువకుడు పాదయాత్ర చేస్తుండటం గమనార్హం. వివరాలివే..
తనది పక్క రాష్ట్రమైనా తెలంగాణలో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న పనులకు అతడు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నడిపిస్తున్న తీరుకు ముగ్ధుడయ్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని ఆకాంక్షించాడు. ఇందుకోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించాడు ఆంధ్రాకు చెందిన శేఖర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన శేఖర్ మంత్రి కేటీఆర్కు అభిమాని. కేటీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. మంత్రి కేటీఆర్ సీఎం కావాలని విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్టాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శేఖర్ అంటున్నాడు. తెలంగాణను అభివృద్ధిలో పరుగులుపెట్టిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నాడు. కేటీఆర్ సీఎం కావాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని చెప్పాడు. మరోవైపు,
దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చూడబోతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న వేళ మంత్రి మల్లారెడ్డి వరంగల్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కాబోయే ప్రధాని కేసీఆరే అని, విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, పూర్తిగా దేశ రాజకీయాలపైనే ఫోకస్ పెడతారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రధాని కావాలని భద్రకాళి అమ్మవారికి మొక్కినట్లు మంత్రి చెప్పారు. కేసీఆర్ దసరా ముహుర్తంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్లీనరీలో ప్రస్తావించినట్లు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి వెళితే, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు కేటీఆర్ ను నియమిస్తారా? దసరాలోపే నిర్ణయం తీసుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CM KCR, Kcr, KTR, Minister ktr, Telangana, Trs