(News 18 ప్రతినిధి కె.వీరన్న,మెదక్ జిల్లా)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి తలుపులు తెరిచి లోనికి వెళ్ళారు. ఇంతలో ఒక మహిళా పెట్రోల్ డబ్బాతో తహసిల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించింది. నాయిభ్ తహసిల్దార్ గదిలోకి వెళ్ళి గడియ బిగుంచుకోని స్వీయ నిర్భంధం చేసుకుంది. ఇంతలోనే సమాచారం తెలుసుకున్న వీఆర్వో హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడున్న జనం పోగయ్యారు. ఆ మహిళను వద్దంటూ వారించారు. ఈ సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.
ఏం జరిగింది..?
డబుల్ బెడ్ రూం ఇల్లు (Double bed room house) రాలేదని మనస్థాపంతో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షురాలు ఇరుమల్ల సుగుణ తన ఆవేదన వ్యక్తం చేసింది. మండల కేంద్రంలోని రోడ్ల విస్తరణ కార్యక్రమానికి అడ్డుగా ఉందని తన ఇల్లు కూల్చి వేశారని తెలిపింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల భర్త లింగాల లక్ష్మణ్ డబుల్ ఇల్లును కేటాయిస్తామని హామీ మేరకే ఆ కూల్చివేతకు ఒప్పుకున్నట్లు ఆమె తెలిపింది.
15 ఏళ్ల క్రితం పార్టీలో చేరా..
గత 15 ఏండ్ల క్రితం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరానని ఆమె చెప్పింది. టీఆర్ఎస్ పార్టీలో చేరి తీవ్రంగా నష్టపోయానని అంది. నేడు అనర్హులకు పైరవీల ద్వారా ఇళ్లు కేటాయించి ఇవాళ తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నాడు మాయమాటలు చెప్పి తన ఇల్లును కూల్చివేశారని ఆమె బోరుమంది.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని డబుల్ బెడ్ ఇల్లు కేటాయించాలని పలుమార్లు స్థానిక మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్,స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించి కాళ్లు మొక్కినా ఎవ్వరు కనికరించడంలేదని వాపోయింది. టీఆర్ఎస్ పార్టీకి నా శక్తి మేర పని చేశానని కానీ పార్టీ నాయకత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం అడగడం లేదని, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు తనకు ఇచ్చిన హామీ మేరకు మాత్రమే ఇల్లు కావాలని ప్రాధేయ పడుతున్నానని ఆమె అన్నారు. నాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే వరకు తహసిల్దార్ కార్యాలయం నుంచి వెళ్ళేది లేదని భీష్మించుకు కూర్చుంది. దీంతో వీఆర్వో వెంటనే తలుపులు పగలగొట్టి ఆమె దగ్గరున్న పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు.
48 ఇళ్లకు 1,400 దరఖాస్తులు...
ఈ సంఘటన పై తహసిల్దార్ విజయ ప్రకాష్ రావును వివరణ కోరగా 48 డబుల్ ఇళ్లకు సుమారు 1,400 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా పాలనాధికారి,ఆర్డీవో అధికారులు, ఆదేశాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక పై అధికారులకు అందజేస్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడతామని తాహసిల్దార్ తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Double bedroom houses, Medak, Siddipet, TRS leaders