తెలంగాణ (Telangana)లో వారం రోజులకు ఓ పరువు హత్య జరగడం ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైన వేటాడి, వెంటాడుతూ నరికి చంపుతున్న దృశ్యాలు, మృతులు రక్తపు మడుగులో పడి చనిపోవడం చూస్తుంటే ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామంలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్కొండకి చెందిన పవార్ దేవీదాస్, సావిత్రీబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.ఇద్దరు కూతుళ్లకు పెళ్లిచేశారు. చిన్నకూతురు రాజేశ్వరి (20) అదే గ్రామానికి చెందిన సలీం (Saleem) ప్రేమించుకున్నారు. సలీం, రాజేశ్వరి పొలాలు గ్రామంలో పక్కపక్కనే ఉన్నాయి. 7వ తరగతి వరకు చదివిన రాజేశ్వరి తల్లిదండ్రులకు తోడుగా పొలం పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పొలం వద్దకు వచ్చే సలీంతో స్నేహం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది.
మూడు నెలల క్రితం పారిపోయారు..
రాజేశ్వరి తరచూ తల్లిదండ్రులు లేని సమయంలో పొలం వద్దకు వెళ్లి సలీంను కలిసుకునేది. ఇరువురు కొద్దిసేపు అక్కడే మాట్లాడుకునే వారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేరే మతం యువకుడితో ప్రేమ వద్దని కూతురిని తండ్రి మందలించారు. అయితే ఒకరంటే ఒకరికి ఇష్టం ఎక్కువ ఉండటం, వేరుగా ఉండలేమని భావించి.. తమను పెద్దలు కలవనీయరని మూడు నెలల క్రితం పారిపోయారు. మహారాష్ట్రలోని సలీం బంధువుల ఇంట్లో ఇద్దరు ఉన్నారు. అయితే ఇరువురు పారిపోయిన విషయం తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సలీంపై యువతి తండ్రి పవార్ దేవీదాస్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు.
పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని..
దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే నెల రోజులుగా అతడు ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు. దీనిపై రాజేశ్వరి నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేది. తాను సలీంనే పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చచ్చిపోతానని బెదిరించేది. తమ కూతురు అతడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గురువారం కూరగాయల కత్తితో రాజేశ్వరి గొంతుకోసి హతమార్చారు. అయితే శుక్రవారం ఉదయం దేవీదాస్ సర్పంచ్ సునీత ఇంటికి వెళ్లి తమ కూతురు గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుందని తండ్రి చెప్పాడు. ఆమె ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పట్టించిన డాగ్ స్క్వాడ్..
సీఐ, ఎస్సై ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించగా.. అవి ఇంటి చుట్టూ తిరిగి దేవీదాస్, సావిత్రీబాయి వద్దకు వచ్చి ఆగిపోయాయి. పోలీసులు గట్టిగా నిలదీయడంతో తామే చంపామని వారు అంగీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. దేవీదాస్, సావిత్రీబాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Honor Killing