ఆ యువతి వయసు 19 ఏళ్లు. అతడి వయసు 27 ఏళ్లు. ఇద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని అతడు కోరితే ఆమె సరేనంది. మా ఊరికి వచ్చెయ్ అని అతడు అనగానే ఇంట్లోంచి వెళ్లిపోయి ఆ యువకుడిని చేరుకుంది. కూతురు కనిపించక ఆ తల్లిదండ్రులు భయపడిపోయి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొబైల్ స్విచాఫ్ లో ఉన్నా ఆధునిక టెక్నాలజీతో ఆ యువతి ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. మొత్తానికి ఆమె ఇంటికి తిరిగొచ్చి ఓ బాంబు లాంటి వార్తను తల్లిదండ్రులకు చెప్పింది. తానొక యువకుడిని ప్రేమిస్తున్నాని, పెళ్లికి ఒప్పుకోమని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తల్లిదండ్రుల పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరకు దారుణమైన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా తండాకు చెందిన అనూష అనే 19 ఏళ్ల యువతికి మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లు పాటు ఫోన్లో చాటింగ్, ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే ఇటీవల ’నేను నిన్ను నేరుగా చూడాలనుకుంటున్నాను. మా ఊరికి రావచ్చు కదా‘ అని ఆ యువకుడు కోరడంతో ఆమె సరేనంది. జనవరి 19న ఆమె బెంగళూరుకు వెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి మహారాష్ట్రలో ఆ యువకుడి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచాఫ్ రావడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ మొదలు పెట్టిన శంకర్ పల్లి పోలీసులు, ఆధునిక టెక్నాలజీతో ఆ యువతి ఎక్కడ ఉందో తెలుసుకోగలిగారు. ఆ యువతిని దాదాపుగా నెల రోజుల తర్వాత శనివారం తిరిగి ఇంటికి రప్పించగలిగారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆ యువతి ఓ బాంబులాంటి వార్తను చెప్పింది. ’నేను మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తున్నాను. అతడితో నా పెళ్లికి ఒప్పుకోండి‘ అంటూ అనూష తేల్చిచెప్పింది. దీనికి ఆ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఇంకా భవిష్యత్ ఉందనీ, చదువుపై దృష్టిపెట్టాలని హెచ్చరించారు. దీంతో మనస్థాపం చెందిన అనూష ఆదివారం ఉదయం స్నానానికి వెళ్తున్నానని బాత్రూంలోకి వెళ్లింది. బాత్రూంలోకి వెళ్లిన అనూష ఎంతకూ తిరిగిరాకపోవడంతో చాలా సార్లు పిలిచారు. అయినప్పటికీ ఆమె నుంచి స్పందన లేకపోవడంతో తలుపులు పగలగొట్టి చూస్తే ఓ షాకింగ్ దృశ్యం వారికి కనిపించింది. అనూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.