సాధారణంగా మ్యూజిక్ & వీడియో క్రియేటర్స్ తమ కంటెంట్ను ఓన్ వెబ్సైట్లలో పబ్లిష్ చేసుకుంటారు. లేదా ఎవరికైనా విక్రయిస్తారు. ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్లు, స్ట్రీమింగ్ సంస్థలు వీటిని కొనుగోలు చేస్తుంటాయి. అయితే కాపీరైటు ఉన్న ఇలాంటి కంటెంట్ను కొందరు యూట్యూబ్ (YouTube)తో సహా గూగుల్ (Google)కు సంబంధించిన సైట్స్లో చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల ఒరిజినల్ క్రియేటర్లకు నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్య ఇప్పుడు యూట్యూబ్తో పాటు మిగతా గూగుల్ ప్లాట్ఫామ్లను కూడా పెద్ద చిక్కుల్లో పడేసింది. కాపీరైట్ లేని కంటెంట్ను ప్లాట్ఫామ్లోనే ఉంచుకోవడం వల్ల క్రియేటర్స్కు జరిగే నష్టాలకు ఆ ప్లాట్ఫామ్లే బాధ్యత వహించాల్సి రావచ్చని తాజాగా జర్మనీ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. థర్డ్పార్టీ సభ్యులు ఈ అనధికారిక కంటెంట్ (Unauthorized Uploads)ను యూట్యూబ్లో అప్లోడ్ చేసినా.. నష్టం మాత్రం యూట్యూబ్ భరించాల్సి రావచ్చని జర్మనీ కోర్టు పేర్కొంది.
ఈ ప్లాట్ఫామ్లు చట్టవిరుద్ధమైన అప్లోడ్ల గురించి తెలుసుకున్న తర్వాత ఆ కంటెంట్కు యాక్సెస్ను త్వరగా నిలిపి వేయకపోతేనే బాధ్యత వహిస్తాయని కోర్టు గురువారం తన తీర్పులో వివరించింది. దీనర్థం ఎవరైనా కాపీరైట్స్ లేని వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాటిని యూట్యూబ్ వెంటనే గుర్తించి.. వాటిని యూజర్లు యాక్సెస్ చేయకుండా యూట్యూబ్యే స్టాప్ చేయాలి. అది కూడా వీలైనంత త్వరగా యాక్సెస్ను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆలస్యం చేస్తే కాపీరైట్ డ్యామేజ్కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి యూట్యూబ్కి రావచ్చు.
వాస్తవానికి 1 ట్రిలియన్ డాలర్ వాల్యూ గల యూరోప్ క్రియేటివ్ ఇండస్ట్రీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల మధ్య చాలా కాలంగా కాపీరైట్ యుద్ధం కొనసాగుతోంది. కొంతకాలం క్రితం యూరోప్ క్రియేటివ్ ఇండస్ట్రీ అనధికార అప్లోడ్ల కోసం పరిహారం కూడా కోరింది. ఈ క్రమంలోనే ఈ కాపీరైట్ కేసు కోర్టుకు చేరింది. అనధికారిక, చట్టవిరుద్ధమైన లేదా ద్వేషపూరిత కంటెంట్ పోస్టింగ్స్పై ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా సైట్స్ ఎంతమేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై విస్తృత చర్చలో భాగంగా ఈ కేసు తెర మీదకు వచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం, ప్లాట్ఫామ్ల ఆపరేటర్లు సూత్రప్రాయంగా ఉల్లంఘనలకు పాల్పడే యూజర్ల గుర్తింపును, వారి ఈ-మెయిల్ అడ్రస్లను బహిర్గతం చేయవలసి ఉంటుంది. దీనర్థం కంటెంట్ను కాపీ కొట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూజర్ల వివరాలను యూట్యూబ్ యాజమాన్యం బయట పెట్టాల్సి ఉంటుంది.
లేఖ పంపినా తొలగని కంటెంట్
న్యాయస్థానం గత ఏడాది ఈయూ (EU) కోర్ట్ ఆఫ్ జస్టిస్ జారీ చేసిన తీర్పును ఆధారంగా చేసుకొని తన తీర్పును వెలువరించింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఒక వ్యక్తి ఒక ఆర్టిస్ట్ వీడియో, ఆడియో రికార్డింగ్ల కాపీరైట్ హక్కులను కొనుగోలు చేశారు. ఆ హక్కులు ఇప్పటికీ అతని వద్దే ఉన్నాయి. అయినప్పటికీ, ఈ వీడియో, ఆడియో రికార్డింగ్స్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి యూట్యూబ్లో షేర్ చేశారు. ఈ విషయం గుర్తించిన హక్కుదారు వాటిని తొలగించాలని యూట్యూబ్ను కోరారు. కానీ యూట్యూబ్ మాత్రం ఆ కంటెంట్ను తన ఫ్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేయలేదు. దీంతో ఈ కంటెంట్ నిర్మాత ఒక న్యాయవాది సహాయంతో యూట్యూబ్కు లేఖ పంపించారు. అప్పటికీ ఆ కంటెంటును యూట్యూబ్ తొలగించలేదు. దీంతో కోర్టు గురువారం తీర్పు పై విధంగా వ్యాఖ్యానించింది.
నిర్మాతకు జరిగిన కాపీరైట్ డ్యామేజ్కు యూట్యూబ్ బాధ్యత వహించాలా వద్దా అనే దానిపై కోర్టు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు, అంటే కొత్త మార్గదర్శకాల ఆధారంగా కేసు పునఃపరిశీలన కోసం దిగువ కోర్టులకు బదిలీ అవుతుంది. అయితే ఈ కేసుపై యూట్యూబ్ స్పందించింది. కాపీరైట్ ఉల్లంఘనపై పోరాడేందుకు... హక్కుదారులు తమ న్యాయమైన వాటాను పొందేలా చూసేందుకు తాము నిర్మించిన సిస్టమ్లపై తమకు నమ్మకం ఉందని యూట్యూబ్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.